రిజల్ట్స్: కన్నడలో 5 ఏళ్ళకు కొత్త పార్టీకి అవకాశం, వరుసగా అధికారానికి దూరం
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో వరుసగా రెండో సారి ఏ పార్టీ కూడ 1985 నుండి అధికారంలోకి రాలేదు. తాజాగా వెలువడుతున్నతాజా ట్రెండ్స్ బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కన్పిస్తున్నాయి. ఇదే జరిగితే కన్నడ ఓటర్లు మరోసారి తమ సంప్రదాయాన్ని కొనసాగించినట్టుగా కన్పిస్తోంది. కన్నడ ఓటర్లు చరిత్రను కొనసాగిస్తారా లేదా సంప్రదాయాన్ని ఫాలో అవుతారా అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కర్ణాటక రాష్ట్రంలో 1985 మార్చి 8వ తేదిన జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. రామకృష్ణ హెగ్డే కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. 1986 ఫిబ్రవరి 13 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత 1986 ఫిబ్రవరి 16 నుండి 1986 ఆగష్టు 10వ తేది వరకు ఈ పదవిలో ఉన్నారు. ఆ తర్వాత జనతాపార్టీకి చెందిన ఎస్.ఆర్ బొమ్మై ఆగష్టు 13, 1988 నుండి 1989 ఏప్రిల్ 21వరకు అధికారంలో కొనసాగారు.ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 1989 ఏప్రిల్ 21వ తేది నుండి 1989 నవంబర్ 30 వ తేది వరకు అసెంబ్లీని రద్దు చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగింది.
1989 నవంబర్ 30 నుండి అక్టోబర్ 10, 1990 వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన వీరేంద్ర పాటిల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో మరోవైపు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. ఈ దఫా కేవలం 7 రోజుల పాటు మాత్రమే రాష్ట్రపతి పాలన కొనసాగింది. 1990 అక్టోబర్ 10వ తేది నుండి 1990 అక్టోబర్ 17వరకు రాష్ట్రపతి పాలన సాగింది. 1990 అక్టోబర్ 17 నుండి 1992 నవంబర్ 19వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్. బంగారప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రిగా వీరప్పమొయిలీ బాధ్యతలను చేపట్టారు.
1992 నవంబర్ 19 నుండి 1994 డిసెంబర్ 11 వరకు వీరప్ప మొయిలీ సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా హెచ్ డి దేవేగౌడ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. 1994 డిసెంబర్ 11 నుండి 1996 మే 31 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగారు. 1996 మే 31 నుండి 1999 అక్టోబర్ 7వరకు జె.హెచ్ పాటిల్ కర్ణాటక సీఎంగా పనిచేశారు.
1999 అక్టోబర్ 11 నుండి 2004 మే 28 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్ఎం కృష్ణ పనిచేశారు ఆ తర్వాత ధరంసింగ్ కర్ణాటక సీఎంగా బాధ్యతలను చేపట్టారు. 2004 మే 28 నుండి 2006 జనవరి 28 వరకు ధరంసింగ్ సీఎంగా కొనసాగారు. 2006 ఫిబ్రవరి3 నుండి 2007 అక్టోబర్ 8 వరకు జనతాదళ్ (ఎస్) కు చెందిన హెచ్ డి కుమారస్వామి కర్ణాటక సీఎంగా బాధ్యతలను చేపట్టారు. 2007 నవంబర్ 12 నుండి 2007 నవంబర్ 19 వరకు కర్ణాటకలో యడ్యూరప్ప సీఎంగా బాధ్యతలను చేపట్టారు. 2007 నవంబర్ 20 నుండి 2008 మే 27 వరకు కర్ణాటక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన సాగింది.2008 మే 30 నుండి 2011 జూలై 31వరకు బి.ఎస్. యడ్యూరప్ప సీఎంగా బాధ్యతలను నిర్వహించారు.
2011 ఆగష్టు 4 నుండి 2012 జూలై 12 నుండి డివి సదానందగౌడ సీఎంగా బాధ్యతలను చేపట్టారు. 2012 నుండి 2013 మే 12 వరకు జగదీష్ షెట్టర్ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. 2013 మే 13 నుండి కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉంది. సీఎంగా సిద్దరామయ్య అధికారంలో కొనసాగుతున్నారు.