ఊహించలేదని కేజ్రీ: హజారే ఎద్దేవా, మమతకు కితాబు
న్యూఢిల్లీ: తాను రాజకీయాల్లోకి వస్తానని తాను కలలో కూడా అనుకోలేదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) సమన్వయకర్త, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెబుతున్నారు. తాను పార్టీ పెడతానని, ఎన్నికల్లో పోటీ చేస్తానని అసలు ఊహించలేదన్నారు. కేజ్రీవాల్ పార్టీ పెట్టిన ఏడాదిలో ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసి షీలా దీక్షిత్ను ఓడించడమే కాకుండా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
కాగా, జన్ లోక్పాల్ బిల్లుపై తాను ఎంతదాకానైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని కేజ్రివాల్ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మైనారిటీ ప్రభుత్వానికి బైటినుంచి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్తో పాటుగా ప్రధాన ప్రతిపక్షమైన బిజెపి కూడా ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అవినీతి అనేది చాలా ముఖ్యమైన సమస్య అని, ఈ విషయంలో తాను ఎంతదాకానైనా వెళ్తానని శనివారం ఇక్కడ పిటిఐ ప్రధాన కార్యాలయంలో వార్తా సంస్థ ఎడిటర్లతో మాట్లాడుతూ అన్నారు.

మీరు రాజీనామా చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన అవినీతి అనే పెద్ద సమస్యపై ఎంతదాకానైనా వెళ్లడానికి తాను సిద్దంగా ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్, బిజెపిలు ఈ బిల్లు ఆమోదం పొందడానికి ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించవని, కామన్వెల్తు క్రీడల ప్రాజెక్టులలో చోటుచేసుకున్న అవినీతిపై విచారణ జరిపించాలని తన ప్రభుత్వం నిర్ణయించినప్పటి నుంచి కాంగ్రెస్ ఈ విషయంలో స్వరాన్ని మరింతగా పెంచిందని అన్నారు.
ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి ఉద్యోగుల దాకా అందరిపైనా విచారణ జరపడానికి, అలాగే అవినీతికి పాల్పడినట్లుగా రుజువైన వారికి జీవిత ఖైదు దాకా శిక్ష విధించడానికి వీలు కల్పిస్తున్న జన్ లోక్పాల్ బిల్లు ముసాయిదాకు గత వారం ఢిల్లీ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
మరోవైపు అన్నా హజారే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కితాబివ్వడమే కాకుండా పరోక్షంగా కేజ్రీవాల్ పైన విమర్శలు గుప్పించారు. మమతా బెనర్జీ నిరాడంబర జీవితం గడుపుతారని, తాను ఆమెను గౌరవిస్తానని అన్నారు. అదే సమయంలో అధికారంలోకి వచ్చాక మమత ప్రభుత్వ బంగ్లాను తీసుకోక పోవడంపై ప్రశంసలు కురిపించారు. మొదట బంగ్లాలు, వాహనాలు తీసుకోమని చెప్పిన వారు ఆ తర్వాత తీసుకున్నారని అన్నా హజారే ఎద్దేవా చేశారు. దేశాన్ని పరిపాలించే సత్తా మమతకు ఉందన్నారు. తాను సూచించిన ప్రతిపాదనలు మమత తప్ప ఏ రాజకీయ పార్టీ అవలంభించలేదన్నారు.
కాగా, మహారాష్ట్ర సదన్లో అన్నా హజారేతో కేజ్రీవాల్ ఇరవై నిమిషాల పాటు భేటీ అయ్యారని ఎఎఫి మీడియా ప్రతినిధి దీపక్ వాజపేయి చెప్పారు. వారు ఏ అంశాలపై చర్చించారనే విషయంపై పెదవి విప్పలేదు.












Click it and Unblock the Notifications