కేంద్రానికి షాక్: పశువిక్రయాల నిషేధం అమలుపై సుప్రీంకోర్టు స్టే
పశు విక్రయాల నిషేధం అమలుపై మద్రాసు హైకోర్టు విధించిన స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేగాక, దేశవ్యాప్తంగా ఇదే నియమం వర్తిస్తుందని, నిషేధంపై స్టే విధిస్తున్నట్లు న్యాయస్థానం.
న్యూఢిల్లీ: పశు విక్రయాల నిషేధం అమలుపై మద్రాసు హైకోర్టు విధించిన స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేగాక, దేశవ్యాప్తంగా ఇదే నియమం వర్తిస్తుందని, నిషేధంపై స్టే విధిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈమేరకు తీర్పు చెప్పింది.
తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది మే నెలలో కేంద్రం పశువుల అమ్మకాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ నిర్ణయంపై పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చోటు చేసుకున్నాయి. నిషేధం విధించడం తమ హక్కులను కాలరాయడమే అంటూ పలు పార్టీల రాజకీయ నేతలు కేంద్రంపై విమర్శలు చేశారు.
తమ ఆహారంపై నిబంధనలు విధించడమేంటని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు మే 30న నిషేధం అమలుపై స్టే విధించింది. తాజాగా మద్రాసు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.
కాగా, న్యాయస్థానం తీర్పుపై కేంద్రం స్పందిస్తూ... నిషేధంపై రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వస్తోందని, దానిపై మరోసారి చర్చిస్తామని చెప్పింది. వారి సూచనల ద్వారా నోటిఫికేషన్లో సవరణలు చేసి.. మరో మూడు నెలల్లో (ఆగస్టు చివరి నాటికి) మళ్లీ కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది.