కేంద్ర బడ్జెట్ 2019 : రూ. 20 కాయిన్స్ వస్తున్నాయోచ్..
ఢిల్లీ : నోట్ల రద్దు అనంతరం కొత్తగా రూ.2,000 నోట్లు అమల్లోకి తెచ్చిన మోడీ సర్కారు తాజాగా మరోసారి నిర్ణయం తీసుకుంది. 20రూపాయల కొత్త నాణేలు విడుదల చేయనున్నట్లు చెప్పింది. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పటి వరకు రూ.1, 2, 5, 10 కాయిన్స్ మాత్రమే అందుబాటులో ఉండగా.. ఇకపై 20రూపాయల నాణేలు కూడా చలామణిలోకి వస్తాయని చెప్పారు.ఈ కొత్త నాణేలు చూపులేని వారు సైతం సులువుగా గుర్తించేలా ఉంటాయని నిర్మల ప్రకటించారు.
కేంద్రం గత మార్చిలో 1, 2, 5, 10 రూపాయల నాణేల డిజైన్లు విడుదల చేసింది. ప్రధాని నరేంద్రమోడీ కొత్త కాయిన్స్ను రిలీజ్ చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రూపొందించిన ఈ నాణేలు బరువు పాత కాయిన్స్ కన్నా ఎక్కువ ఉంటుందని సమాచారం. సైజు విషయంలోనూ ఇవి పాత వాటికన్నా పెద్దగా ఉండనున్నాయి.
కొత్తగా మార్కెట్లోకి రానున్న 20రూపాయల నాణెం 12 అంచులతో ఉంటుంది. ఈ నాణెం బరువు 8.54 గ్రాములు కాగా.. ఒకవైపు సింహం, అశోక స్తంభం, సత్యమేవ జయతే సూక్తి ఉంటుంది. రెండో వైపు రూ. 20 అని రాసి ఉంటుంది. 10రూపాయల బిళ్లలాగే ఈ నాణేనికి కూడా రెండు రింగులు ఉంటాయి. బయటి రింగును 65శాతం రాగి, 15శాతం జింక్, 20శాతం నికెల్తో తయారు చేయగా.. రింగ్ లోపలి భాగం 75శాతం రాగి, 20శాతం జింక్, 5శాతం నికెల్తో రూపొందించినట్లు తెలుస్తోంది. కొత్త కాయిన్స్ను త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.