కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు -ఎన్నికను ఖరారు చేసిన CWC -భేటీలో తీవ్రవాగ్వాదం
గడిచిన ఏడేళ్లుగా దేశమంతటా బీజేపీ ప్రభంజనం కొనసాగుతుండగా, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాత్రం బలహీనమవుతూ వస్తుండటం, పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత అంతర్గత వ్యవహారాలపై అసమ్మతిదారులు బాహాటంగా విమర్శలు చేస్తుండటం, సీనియర్లు సైతం తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీని టార్గెట్ చేయడం, గాంధీ-నెహ్రూ కుటుంబేతరుల చేతికే పార్టీ పగ్గాలు అప్పగించాలని రాహుల్ భీష్మించడం తదితర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక మండలి ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది..
Recommended Video
తిరుపతి
ఉపఎన్నిక:
పవన్
రామబాణం
-రూ.30లక్షల
విరాళం
-రాక్షసుడుణ్ని
పండితుడంటూ
అనూహ్యం
కాంగ్రెస్కు కొత్త అధ్యక్షుడు ఖరారు
జాతీయ కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో శుక్రవారం పార్టీ అత్యున్నత మండలి 'కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)' సమావేశమై, భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది. రెండు గ్రూపులుగా విడిపోయిన నేతల మధ్య తీవ్రవాగ్వాదం అనంతరం ఎట్టకేలకు కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది. కాంగ్రెస్ కు కొత్త జాతీయ అధ్యక్షుడిని నియమించుకోవాల్సిన అవసరతను గుర్తిస్తూ, ఆ ప్రక్రియను చేపట్టాలనే తీర్మానానికి అంగీకారం తెలిపింది. ఈ ఏడాది జూన్ మాసంలో కాంగ్రెస్ కొత్త చీఫ్ ను ఎన్నుకోవాలని సీబ్ల్యూసీ నిర్ణయించింది. కాగా..
24 ఏళ్ల తర్వాత ఎన్నిక ద్వారా..
గాంధీ-నెహ్రూ కుటుంబీకుల సారధ్యంలో నడుస్తోన్న కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పదవిని భర్తీ చేసే ప్రక్రియ ఇన్నాళ్లూ ఎంపిక విధానంలోనే సాగడం తెలిసిందే. అంటే, హైకమాండ్ ప్రతిపాదించిన వ్యక్తే పార్టీ చీఫ్ గా ఉండే సాంప్రదాయం నడిచింది. కానీ 2021 జూన్ లో జరుగనున్న ప్రక్రియ మాత్రం ఎన్నికల విధానంలో నిర్వహించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. చివరిసారిగా సీడబ్ల్యూసీకి 1997లో ఎన్నిక జరిగింది. మళ్లీ 24 ఏళ్ల తర్వాత సీడబ్ల్యూసీకి ఎన్నిక నిర్వహించనున్నారు. అధ్యక్షు పదవి, సీడబ్ల్యూసీతోపాటు రాష్ట్ర, జిల్లాల కార్యవర్గాలను కూడా ఎన్నికల విధానంలోనే భర్తీ చేయాలని అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది. కొత్త చీఫ్ పదవి కోసం జరిగే ఎన్నికలో తాను అభ్యర్థిగా ఉండబోనని రాహుల్ గాంధీ ఇదివరకే స్పష్టం చేయగా, శుక్రవారం నాటి సమావేశంలోనూ అదే విషయాన్ని ఆయన కరాకండిగా చెప్పేశారు. కానీ..
సీడబ్ల్యూసీలో తీవ్రవాగ్వాదం..
అధినేత్రి సోనియా గాంధీకి గతంలో అసమ్మతి లేఖ రాసిన గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్ లకు తోడు మాజీ మంత్రి పి.చిదంబరం సైతం సీబ్ల్యూసీలో కీలక ప్రతిపాదన చేశారు. కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎన్నికను తక్షణమే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కానీ సోనియా లాయలిస్టులైన అశోక్ గెహ్లాట్, అమరీందర్ సింగ్, ఏకే ఆంటోనీ, తారీక్ అన్వర్, ఉమన్ చాందీలాంటి నేతలు ఆజాద్ వర్గం ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో సమావేశంలో రెండు వర్గాల మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. ''మనం ఎవరి ఏజెంట్లుగా పనిచేస్తున్నాం? బీజేపీ నేతలు ఎప్పుడైనా తమ అంతర్గత విషయాలను బహిరంగంగా మాట్లాడారా? ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని ముందు పెట్టుకుని.. అంతర్గత ఎన్నికలకు డిమాండ్ చేయడం భావ్యమేనా?''అని ఓ నేత ఆగ్రహంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో..
5రాష్ట్రాల ఎన్నికల తర్వాతే కొత్త చీఫ్..
ముందుగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్థానాన్ని పదిలం చేసుకున్న తర్వాతే, పార్టీ అధ్యక్ష ఎన్నికలకు వెళదామన్న సోనియా లాయలిస్టుల వాదనే ఎట్టకేలకు నెగ్గింది. ఈ ప్రతిపాదనకు అసమ్మతి నేతలు సరే అనడంతో కొత్త చీఫ్ ఎన్నికను జూన్ మాసంలో నిర్వహించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. ఈ ఏడాది మార్చి-మేలో అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం తెలిసిందే. కొత్త అధ్యక్షుడు, సీడబ్ల్యూసీ ఎన్నికలను జూన్ లో నిర్వహిస్తామని, అయితే, సంబంధిత తేదీలను అధినేత్రి సోనియా ఖరారు చేస్తారని ఏఐసీసీ అధికార ప్రతినిధి కేసీ వేణుగోపాల్ మీడియాకు తెలిపారు.
షాకింగ్: క్షీణించిన శశికళ ఆరోగ్యం -విషమంగా వెంటిలేటర్పై చికిత్స -మణిపాల్కు తరలింపు