కొత్త ఏడాదిలో కేంద్రం బిగ్ షాక్..! ఆ వస్తువులపై 40 శాతం జీఎస్టీ..!
గతేడాది దేశవ్యాప్తంగా జీఎస్టీ 2.0 సంస్కరణలు అమల్లోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం అంతకు ముందు ఉన్న నాలుగు స్లాబ్ లను రెండు స్లాబ్ లకు కుదించింది. దీంతో దీపావళి కానుకగా ఎన్నో వస్తువులపై పన్నులు తగ్గాయి. ట్రంప్ సుంకాల దెబ్బ నేపథ్యంలో దేశీయంగా వస్తువుల వినియోగం పెంచేందుకు వీలుగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు ఊరటనిచ్చింది. అయితే కొత్త సంవత్సరంలో మాత్రం కేంద్రం జీఎస్టీ విధింపు విషయంలో భారీ షాక్ ఇచ్చింది.
జీఎస్టీ స్లాబ్ లను గరిష్టంగా 18 శాతానికి కుదించిన నేపథ్యంలో దేశంలో పొగాకు ఉత్పత్తులపై అంతకు మించి పన్ను విధించే పరిస్ధితి లేకపోవడంతో కేంద్రం జీఎస్టీ పరిహార సెస్ స్ధానంలో కొత్త ఎక్సైజ్ సుంకం, సెస్ ను తీసుకొస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి ఇది అమల్లోకి రాబోతోంది. దీంతో పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాలు, సిగరెట్లపై ఇలా 40 శాతం పన్ను విధించబోతున్నారు. పేద ప్రజలు వినియోగించే బీడీలపై మాత్రం 18 శాతం జీఎస్టీ విధిస్తారు. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.

కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం జీఎస్టీకి అదనంగా ఈ ఉత్పత్తులపై జాతీయ భద్రతా సెస్ విధిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు చూయింగ్ టొబాకో, జర్దా సెంటెడ్ టొబాకో, గుట్కా ప్యాకింగ్ మెషీన్స్ (సామర్థ్య నిర్ధారణ మరియు సుంకం వసూలు) నిబంధనల్ని నోటిఫై చేసింది. ఈ నియమాలు ఉత్పత్తి సామర్థ్యాన్ని అంచనా వేయడానికి, చూయింగ్ టొబాకో, సుంటెడ్ పొగాకు, గుట్కా తయారీదారుల నుండి సుంకం వసూలు చేయడానికి అధికారులను నిర్దేశించబోతున్నాయి.

వాస్తవానికి పాన్ మసాలా తయారీపై కొత్త ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్సు విధించడానికి, పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించడానికి అనుమతించే రెండు బిల్లులను డిసెంబర్లో పార్లమెంటు ఆమోదించింది. దీనికి అనుగుణంగానే కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు చట్టాన్ని ఆమోదించినా.. కొత్త పన్ను విధానం ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందో కేంద్రం చెప్పలేదు. కానీ కొత్త ఏడాదిలో మాత్రం ఇది ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది.












Click it and Unblock the Notifications