రాష్ట్రపతికి దక్కిన అరుదైన గౌరవం.. ముర్ము పేరుతో మొక్క
ప్రకృతి ఒడిలో దాగివున్న రకరకాల రహస్యాలు ఎప్పటికప్పుడు మానవాళిని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. తాజాగా తమిళనాడులోని కుడ్డలోర్ జిల్లా తీర ప్రాంతంలో వృక్షశాస్త్రవేత్తలు ఒక అరుదైన, ఇంతవరకు ప్రపంచానికి తెలియని కొత్త రకం మొక్కను కనుగొన్నారు. సముద్రపు ఇసుక తిన్నెలపై పెరుగుతున్న ఈ వింత మొక్కకు మన దేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవార్థం 'ల్యూకాస్ ద్రౌపదియే'అని నామకరణం చేశారు. ఈ కొత్త ఆవిష్కరణ ఇప్పుడు అంతర్జాతీయ వృక్షశాస్త్ర రంగాన్ని ఆకట్టుకుంటోంది.
విశిష్టమైన పరిశోధన.. ఏడాది పాటు పరిశీలన
అన్నామలై యూనివర్సిటీ, ప్రభుత్వ సిద్ధ వైద్య కళాశాలకు చెందిన పరిశోధకుల బృందం కుడ్డలోర్ సముద్ర తీరంలోని ఇసుక దిబ్బలపై ఈ కొత్త మొక్కను చూశారు. గాలి తీవ్రత ఎక్కువ ఉండే ఉప్పు నేలల్లో ఇది పెరుగుతుండటాన్ని గమనించి, ఏడాది పాటు దీని పెరుగుదల, జీవన చక్రాన్ని నిశితంగా పరిశీలించారు. అనంతరం బ్రిటన్లోని లండన్ న్యాచురల్ హిస్టరీ మ్యూజియం, రాయల్ బొటానిక్ గార్డెన్స్ వంటి అంతర్జాతీయ వృక్షశాస్త్ర నిల్వలతో పోల్చి చూశారు. ఇప్పటివరకు ఈ ప్రజాతిలో ఉన్న 155 రకాల మొక్కల కంటే ఇది పూర్తిగా భిన్నమైనదని నిరూపితమైంది.

ఈ మొక్కలోని ప్రత్యేకతలు ఏంటి?
తులసి, పుదీనా కుటుంబానికి చెందిన ఈ మొక్క, సాధారణ మొక్కలకంటే ఎంతో భిన్నమైన లక్షణాలను కలిగి ఉంది. సాధారణంగా ఈ జాతి మొక్కలు భూమిపై పాకే తీగల్లా లేదా దట్టమైన పొదల్లా పెరుగుతాయి. కానీ ఈ 'ల్యూకాస్ ద్రౌపదియే' మొక్క మాత్రం ఎటువంటి కొమ్మలు లేకుండా, దాదాపు 15 సెంటీమీటర్ల ఎత్తులో నిలువుగా ఒకే కాడపై ఒంటరిగా పెరుగుతుంది. సముద్రపు వేడి ఇసుకలో తట్టుకోవడానికి లోతైన వేళ్లు కాకుండా, పైపైన పరుచుకునే పీచు వేళ్లను కలిగి ఉండటం దీని ప్రత్యేకత.
శాస్త్రవేత్తల ప్రశంసలు.. రాష్ట్రపతికి గౌరవం
గిరిజన ప్రాంతం నుంచి వచ్చి దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవిని చేపట్టిన ద్రౌపది ముర్ము సేవలకు గుర్తుగా ఈ మొక్కకు ఆమె పేరు పెట్టామని పరిశోధకులు తెలిపారు. ప్రాకృతిక ఒత్తిడులు, సముద్రపు గాల్లు ఎక్కువగా ఉండే వాతావరణంలో సైతం ఈ మొక్క తట్టుకుని నిలబడటం విశేషం. ఈ ఆవిష్కరణ ద్వారా తమిళనాడు తీరప్రాంత జైవిక వైవిధ్యం మరోసారి ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు సాధించింది.














Click it and Unblock the Notifications