అంబానీ ఇంటి వద్ద కుట్రలో భారీ ట్విస్ట్- ఇద్దరి హత్యకు వాజే ప్లాన్-షాకింగ్ రీజన్
ముంబైలోని రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్దాలు అమర్చేందుకు జరిగిన కుట్ర కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ అధికారులు సస్పెండైన పోలీసు అధికారి సచిన్ వాజేపై జరుపుతున్న విచారణలో ఈ ట్విస్ట్ ఎదురైంది. ఈ వ్యవహారంలో సచిన్ వాజే ఇద్దరిని చంపేందుకు ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ నిర్ధారించింది.
అంబానీ నివాసం ఆంటీలియా బయట పేలుడు పదార్దాలున్న ఎస్యూవీ వాహనాన్ని నిలిపి ఉంచిన వ్యవహారంలో ఇద్దరిని చంపి వారిపై ఆ నెపాన్ని మోపేందుకు సచిన్ వాజే కుట్ర పన్నినట్లు ఎన్ఐఏకి ఆధారాలు లభించాయి. ఈ కేసు విచారిస్తున్న ఎన్ఐఏ అధికారులకు సచిన్ వాజే నివాసంలో ఓ పాస్ట్పోర్టు లభించింది. దీని ఆధారంగా వాజే కుట్ర బయటిపడినట్లు చెప్తున్నారు. దీంతో ఆంటీలియా బాంబు కుట్ర కేసు ఎన్కౌంటర్ ఆరోపణలకు కూడా తావిస్తోంది.
సచిన్ వాజే తన నివాసంలో దొరికిన పాస్పోర్టులో ఉన్న వ్యక్తితో పాటు మరో వ్యక్తిని అంతం చేసి వారిపై అంటీలియా వద్ద ఎస్వీయూలో పేలుడు పదార్ధాలు ఉంచిన నేరం మోపేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరిని ఎన్కౌంటర్ చేసేందుకు ప్రయత్నించిన నేరం కూడా ఇప్పుడు వాజేపై నమోదైంది. ఈ ఇద్దరిని హతమార్చి ఆంటీలియా కేసును ముగించేందుకు సచిన్ వాజే ప్రయత్నించినట్లు ఆధారాలు లభించాయి. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు మరింత కలకలం రేపుతోంది.