టీవీ ఛానెల్ చీఫ్ ఎడిటర్ మీద లైంగిక వేదింపుల కేసు
గౌహతి: మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించిన ఘటనలో ఓ న్యూస్ ఛానెల్ ఎడిటర్ ఇన్ చీఫ్ మీద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన మహిళా జర్నలిస్టు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.
అసోంలోని గౌహతికి చెందిన ప్రయివేటు టీవీ ఛానల్ చీఫ్ ఎడిటర్ అటాను భుయాన్ లైంగిక వేదింపుల ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. అదే విధంగా సదరు ఛానెల్ యజమాని, అసోం మంత్రి రోకిబుల్ హుస్సేన్ పై ఢిల్లీ మహిళా కమీషన్ కు ఆమె ఫిర్యాదు చేశారు.
చీఫ్ ఎడిటర్ తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ టీవీ ఛానెల్ యజమాని, మంత్రికి ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోలేదని, తన ఉద్యోగం తీసేసి చేతులు దులుపుకున్నారని ఆమె మహిళా కమీషన్ కు ఫిర్యాదు చేశారు.
2015 ఆగస్టులో ఆమె టీవీ చానెల్ లో జర్నలిస్టుగా చేరారు. తరువాత చానెల్ సీఈవో తనను లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కోరిక తీర్చాలని పదేపదే అతను ఫోన్ చేసి వేధించాడని ఆమె ఆరోపించింది.
అర్దరాత్రి డ్యూటీ చెయ్యాలని వేధింపులకు గురి చేశారని తన ఫిర్యాదులో తెలిపారు. ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందం గౌహతి చేరుకుని విచారణ చేపట్టింది.
అయితే ఈ విషయంపై స్పందించడానికి టీవీ ఛానెల్ యజమాని, అసోం మంత్రి, ఛానెల్ చీఫ్ ఎడిటర్ మీడియాకు అందుబాటులోకి రావడం లేదు. పలువురు మీడియా సభ్యులు వీరి నుంచి వివరణ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.