లోకసభ మాజీ స్పీకర్ పిఎ సంగ్మా కన్నుమూత
న్యూఢిల్లీ: లోకసభ మాజీ స్పీకర్ పిఎ సంగ్మా శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. 1996 నుంచి 1998 వరకు 11వ లోకసభకు ఆయన స్పీకర్గా బాధ్యతలు నిర్వర్తించారు.
1988-1990 మధ్య మేఘాలయ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన ఎనిమిదిసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన మేఘాలయలోని తురా లోకసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పిఎ సంగ్మా వయస్సు 68.
ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పిఎ సంగ్మా 1947 సెప్టెంబర్ 1న జన్మించారు. ఎనిమిది సార్లు పార్లమెంటుకు ఎన్నికైన సంగ్మా ప్రస్తుతం మేఘాలయాలోని తురా (ఎస్టీ) నియోజకవర్గం ఎంపీగా ఉన్నారు.
2012లో రాష్ట్రపతి పదవి కోసం ప్రణబ్ ముఖర్జీపై పోటీపడి ఓటమి పాలయ్యారు. ఆయన కుమార్తె అగాధ సంగ్మా 15వ లోకసభకు ఎంపికై యూపీఏ హయాంలో మంత్రి పదవిని చేపట్టారు. అతి చిన్న వయసులో కేంద్రమంత్రిగా పని చేసిన రికార్డు ఆమె సొంతం. సంగ్మా కుమారుడు కోర్నాడ్ సంగ్మా ప్రస్తుతం మేఘాలయ అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్నారు.