శిబిరంలోకి వెళ్లి...: టెర్రరిస్ట్లపై తెలుగు అధికారి తెగువ

అస్సోంలో బోడో తీవ్రవాదుల చెరలో 50 రోజులుగా నున్న అనిల్ కుమార్ అగర్వాల్ను సురక్షితంగా కాపాడారు. అనిల్ కుమార్ అగర్వాల్ను సెప్టెంబర్ 21వ తేదీన నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ సంజిత్ వర్గానికి చెందిన బోడో తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. అతన్ని విడుదల చేసేందుకు వారు ఆ కంపెనీని రూ.20 కోట్ల వరకు డిమాండ్ చేశారు. ఆ అధికారిని బోడోల చెర నుండి విడిపించడానికి అక్కడి ప్రభుత్వం చెయ్యని ప్రయత్నం లేదు.
చివరకు ఆ రాష్ట్రంలో నార్త్ రీజియన్ డిఐజి రామిశెట్టి విజయ కృష్ణకు కొద్దిరోజుల క్రితం ఈ బాధ్యతను అప్పగించారు. విజయ కృష్ణ ఈ కిడ్నాప్ను ఓ సవాల్గా తీసుకొని ప్రత్యేక వ్యూహంతో సనత్పూర్ జిల్లా బైదూర్ అడవుల్లో ఆ ముఠా ఆచూకీ తెల్సుకుని అగర్వాల్ను సురక్షితంగా సోమవారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో విడిపించగలిగారు. విజయ కృష్ణ స్వయంగా బోడో మిలిటెంట్ల శిబిరంలోకి ప్రవేశించారు.
అక్కడకు వెళ్లేందుకు విజయ కృష్ణ పెద్ద పథకమే రచించారు. దానిని అమలు చేశారు. కిడ్నాప్కు పాల్పడ్డ తీవ్రవాదులతో సంబంధమున్న వారిని తమ వైపుకు తిప్పుకొని, ప్రణాళిక ప్రకారం కొందరిని తీవ్రవాదులు ఉండే ప్రాంతానికి పంపించారు. తర్వాత వారి ద్వారానే విజయ కృష్ణ ఆపరేషన్లోకి స్వయంగా ప్రవేశించారు. వారితో కలిసిపోయినట్లు నటించారు. కాలకృత్యాలు తీర్చుకుంటున్నట్లు నమ్మించి అనిల్ అగర్వాల్ను బయటకు తెచ్చారు.
ఈ సమయంలో అక్కడే సిద్ధంగా ఉన్న భద్రతా దళాలు తీవ్రవాదుల పైకి కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది బోడో తీవ్రవాదులు చనిపోయారు. ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఆపరేషన్ పైన అస్సోంలో సర్వత్రా హర్షాతిరేకం వ్యక్తమైంది. తిరువూరుకు చెందిన విజయ కృష్ణ విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో డిగ్రీ చదువుతూ పోలీసు ఉన్నతాధికారి కావాలనే లక్ష్యంతో ప్రత్యేక శిక్షణ పొంది ఐపిఎస్కు సెలెక్ట్ అయ్యారు.












Click it and Unblock the Notifications