కేరళ ఐసిస్ కథలో ట్విస్ట్: 'గర్భస్రావం కూడా చేయించాడు'
తిరువనంతపురం: కేరళలో ఐసిస్ ఉగ్రవాదానికి అక్కడి యువతులు కొందరు ప్రభావితులు అవుతున్నారంటూ ఇటీవలే మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాదు కేరళ నుంచి ఐసిస్లో చేరేందుకు ఫాతిమా అనే యువతి కూడా వెళ్లిందని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు.
తన భర్త ఎజా అలియాస్ బెక్స్టన్తో కలిసి ఆమె కనిపించకుండా పోయిన ఘటన కలకలం రేగింది. దీంతో ఫాతిమా తల్లి బిందు బుధవారం మీడియాతో మాట్లాడారు. పుదుచ్చేరి మెడికల్ కాలేజీ విద్యార్ధి రెహ్మాన్ తన కుమార్తె నిమిషాను ప్రేమలోకి దించాడని ఆమె పేర్కొంది.
అనంతరం ఆమెను బలంవంతం చేయడంతోనే మతం మారిందని ఫాతిమా అలియాస్ నిమిషా తల్లి బిందు ఆరోపించారు. 2013లో తన కుమార్తె నిమిషాను బలవంతంగా ఇస్లాంలోకి మార్చడమే కాకుండా ఆమెకు గర్భస్రావం కూడా చేయించాడని ఆమె ఆరోపించారు.
రెహ్మాన్తో విడిపోయిన తర్వాత కూడా తన కుమార్తె ముస్లింగానే కొనసాగిందని ఆమె పేర్కొన్నారు. అట్టింగల్కు చెందిన రహ్మాన్ పుదుచ్చేరి మెడికల్ కాలేజీలో ఎండీ విద్యను అభ్యసిస్తున్నాడు. పుదుచ్చేరిలోని ఓ ప్రైవేట్ ఎంట్రన్స్ కోచింగ్ సెంటర్లో కోచింగ్కు నిమిషా వెళ్లిన క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.
ఆ తర్వాత పరిచయం కాస్త ప్రేమగా మారిందని ఆమె చెప్పుకొచ్చారు. ఆ తర్వాత పోయినాచ్చిలోని సెంచరీ డెంటల్ కాలేజీలో బీడీఎస్ విభాగంలో ఫాతిమాకు అడ్మిషన్ వచ్చిందని, ఆ తర్వాత కూడా రెహ్మాన్తో నిమిషా తన సంబంధాన్ని కొనసాగించిందని ఆమె వెల్లడించారు.
అయితే రెహ్మాన్తో ఉన్న సంబంధం గురించి తమకు ఎప్పుడు చెప్పలేదని, అతడి ద్వారానే ఈ విషయాలు తెలిశాయని ఆమె అన్నారు. తమ దగ్గరకు వచ్చినప్పుడు హిందువుగానే ఉండేదని చెప్పిన ఆమె నిమిషాను కలవడానికి పలుమార్లు రెహ్మాన్ ప్రయత్నించినా ఆమె ఒప్పుకోలేదని వివరించారు.
ఆ తర్వాత 2015లో కాలేజీలో తన తోటి విద్యార్ధి అయిన ఎజా అలియాస్ బెక్స్టన్ను తన కుమార్తె నిమిషా వివాహం చేసుకుందని ఆమె వెల్లడించారు. నా కుమార్తె కనిపించకుండా పోవడానికి కారణం రెహ్మానేనని ఆమె ఆరోపించారు. ఆమె ఎక్కడ ఉందో తెలియడం లేదని ఆమె కన్నీరుమున్నీరయ్యాయరు.
నిమిషా అదృశ్యమైన విషయం తెలిసి రెహ్మాన్ నన్ను సంప్రదించాడని, తనను క్షమించాలని కోరాడని చెప్పారు. గతంలో నిమిషా లాగే ఇద్దరు ముగ్గురు యువతులు కనిపించకుండా పోయారని రెహ్మన్ తనతో చెప్పాడని ఆమె పేర్కొన్నారు.
ఇటీవల కేరళలో అదృశ్యమైన వారిలో ఎక్కువ మంది ఐసిస్ ఉగ్రవాదానికి ప్రభావితులు అయినవారేనని తెలియడం, వీరిలో కొంతమంది యవతీ యువకులు ఇప్పటికే దేశం దాటి ఉగ్రవాదులుగా మారిపోయారన్న వార్తలు గత నెలలో వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.