నిర్బయ గ్యాంగ్ రేప్ దోషులు: పదేళ్లు జైలు
న్యూఢిల్లీ: ఢిల్లీ విద్యార్థిని (23) గ్యాంగ్ రేప్ కేసులోని దోషులకు మరో కేసులో న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2012 డిసెంబర్ 16వ తేదిన ఢిల్లీలో మెడికల్ విద్యార్థిని (నిర్బయ కేసు)పై గ్యాంగ్ రేప్ చేశారు. ఆమె మరణానికి కారణం అయ్యారు.
ఈ కేసులో జైలులో ఉన్న వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్, అక్షయ్ కుమార్ సింగ్ అనే నిందితులకు మరో కేసులో ఢిల్లీ సెషన్స్ కోర్టు ఒక్కోక్కరికి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 1.01 లక్షల జరిమానా విధిస్తు తీర్పు చెప్పింది.
దోషుల నేరాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ శిక్ష విధించామని, ఇలాంటి వారి మీద కనికరం చూపించాల్సిన అవసరం లేదని సెషన్స్ కోర్టు జడ్జి రితేశ్ సింగ్ స్పష్టం చేశారు. నిందితులు నిర్బయను గ్యాంగ్ రేప్ చెయ్యక ముందు (అదే రోజు) రామ్ ఆధర్ (కార్పెంటర్) అనే వ్యక్తిని, ఆయన భార్యను బస్సులో ఎక్కించుకున్నారు.
తరువాత దంపతుల మీద దాడి చేసి వారి దగ్గర ఉన్న మొబైల్ ఫోన్, రూ. 1,500 లాక్కోని వారిని బస్సులో నుండి కిందకు నెట్టి వేసి వెళ్లారు. తరువాత నిర్బయ, ఆమె స్నేహితుడిని బస్సులో ఎక్కించుకున్నారు. అనంతరం నిర్బయ మీద గ్యాంగ్ రేప్ చేసి, ఆమె స్నేహితుడిని గాయపరిచి బస్సులో నుండి కిందకు నెట్టి వేసి పరారైనారు.
ఇదే కేసులో ఈ నలుగురితో పాటు రామ్ సింగ్, ఒక మైనర్ ను పోలీసులు అరెస్టు చేశారు. రామ్ సింగ్ తీహార్ జైలులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. నిర్బయ కేసులో నిందితులకు ఢిల్లీ హై కోర్టు ఉరి శిక్ష విధించింది.