నిర్భయ దోషికి ఉరి తీయక తప్పదు: ఆ శిక్షకు అర్హుడే: రివ్యూ పిటీషన్ తోసిపుచ్చిన సుప్రీం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో 2012లో చోటు చేసుకున్న నిర్భయ అత్యాచారం కేసులో దోషిగా తేలిన అక్షయ్ కుమార్ సింగ్ కు ఉరి తీయక తప్పదని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఆ శిక్షకు అతను అర్హుడేనని స్పష్టం చేసింది. అక్షయ్ కుమార్ సింగ్ తో పాటు ప్రస్తుతం జీవించి ఉన్న మరో ముగ్గురికి ఉరిశిక్షను విధిస్తూ ఇదివరకే ఇచ్చిన తీర్పును సవరించలేమని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. మరోసారి వాదోపవాదాలను వినడానికి తాము సిద్ధంగా లేమని పేర్కొంది.

చదవి వినిపించిన భానుమతి..
నిర్భయపై అత్యాచారం కేసులో తనకు ఉరిశిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ రివ్యూ పిటీషన్ ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ ఏ బొపన్నలతో కూడిన ముగ్గురు సభ్యులు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. అరగంటలో తీర్పును వెలవరించింది. తీర్పు ప్రతిని జస్టిస్ భానుమతి చదవి వినిపించారు. ఈ కేసులో ఇదివరకే ఇచ్చిన తీర్పును ఎట్టి పరిస్థితుల్లో కూడా సవరించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

మంగళవారమే విచారణ చేపట్టాల్సి ఉన్నా..
నిజానికి- లిస్టింగ్ ప్రకారం- మంగళవారమే అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ పై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ఎస్ ఏ బొబ్డె, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ భానుమతిలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తొలుత వాదోపవాదాలను ఆరంభించింది. ఆ వెంటనే- ఎస్ ఏ బొబ్డె జోక్యం చేసుకున్నారు. తాను రివ్యూ పిటీషన్ విచారణ నుంచి తప్పుకొంటున్నట్లు వెల్లడించారు. కొత్త ధర్మాసనానికి దీన్ని బదలాయిస్తున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రానికంతా.. కొత్త ధర్మాసనం ఏర్పాటు చేశారు.

తీహార్ జైలులో దోషులు..
2012 డిసెంబర్ 16వ తేదీన దేశ రాజధానిలో చోటు చేసుకున్న నిర్భయ ఉదంతం.. దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. అత్యంత పాశవికంగా పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై కదులుతున్న బస్సులో అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుమంది కామాంధులు. వారిలో రామ్ సింగ్ ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకరు మైనర్ గా తేలడంతో అతణ్ని జువైనల్ హోంలో శిక్ష విధించారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ సింగ్, వినయ్ శర్మ, పవన్ కుమార్ గుప్తా, ముఖేష్ సింగ్ లకు సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది.












Click it and Unblock the Notifications