ఉరిశిక్ష తప్పదు.. అయినా క్షమాభిక్షకు సుప్రీం చివరి అవకాశం..
న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం కేసులో దోషిగా తేలిన అక్షయ్ కుమార్ సింగ్ కు దేశ అత్యున్నత న్యాయస్థానం.. క్షమాభిక్షకు అవకాశాన్ని కల్పించింది. ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా బదలాయించుకోవడానికి చివరి అవకాశాన్ని ఇచ్చింది. రాష్ట్రపతికి క్షమాభిక్షను కోరవచ్చని సూచించింది. దీనితో తనకు మూడు వారాల గడువు కావాలని అక్షయ్ కుమార్ సింగ్ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష కోరవచ్చని..
ఉరిశిక్షను విధిస్తూ 2017లో ఇచ్చిన తీర్పును సవరించబోమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసినప్పటికీ.. క్షమాభిక్షను కోరే అవకాశాన్ని అక్షయ్ కుమార్ సింగ్ కు కల్పించింది. క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు విజ్ఞప్తి చేసుకోవచ్చని సూచించింది. దీనితో ఈ విజ్ఞప్తిని రాష్ట్రపతికి సమర్పించడానికి కనీసం మూడు వారాల గడువు ఇవ్వాలని అక్షయ్ కుమార్ సింగ్ తరఫు న్యాయవాది ఏపీ సింగ్ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.
వారం చాలు..
ఏపీ సింగ్ చేసిన వాదనలను ఢిల్లీ ప్రభుత్వం తరఫున వాదనలకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కొట్టి పారేశారు. నిబంధనల ప్రకారం.. వారం రోజులు మాత్రమే దోషిగా క్షమాభిక్ష కోసం గడువు ఇవ్వడానికి అవకాశం ఉందని అన్నారు. దీనికి సంబంధించిన నిబంధనలను ఆయన కోర్టు హాలులో చదివి వినిపించారు. వారం రోజుల్లో దోషి. క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి అభ్యర్థనలను దాఖలు చేసుకోవచ్చని, అంతకు మించి ఒక్క గంట కూడా అదనంగా కేటాయించడం చట్టవిరుద్ధమౌతుందని అన్నారు.
రివ్యూ పిటీషన్ ను కొట్టేసిన సుప్రీం..
దేశ రాజధానిలో 2012లో చోటు చేసుకున్న నిర్భయ అత్యాచారం కేసులో దోషిగా తేలిన అక్షయ్ కుమార్ సింగ్ కు ఉరి తీయక తప్పదని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఆ శిక్షకు అతను అర్హుడేనని స్పష్టం చేసింది. అక్షయ్ కుమార్ సింగ్ తో పాటు ప్రస్తుతం జీవించి ఉన్న మరో ముగ్గురికి ఉరిశిక్షను విధిస్తూ ఇదివరకే ఇచ్చిన తీర్పును సవరించలేమని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. మరోసారి వాదోపవాదాలను వినడానికి తాము సిద్ధంగా లేమని పేర్కొంది.
తీర్పు కాపీని చదివి వినిపించిన భానుమతి..
నిర్భయపై అత్యాచారం కేసులో తనకు ఉరిశిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ రివ్యూ పిటీషన్ ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ ఏ బొపన్నలతో కూడిన ముగ్గురు సభ్యులు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. అరగంటలో తీర్పును వెలవరించింది. తీర్పు ప్రతిని జస్టిస్ భానుమతి చదవి వినిపించారు. ఈ కేసులో ఇదివరకే ఇచ్చిన తీర్పును ఎట్టి పరిస్థితుల్లో కూడా సవరించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.