నిర్భయ దోషులకు ఉరితీత తేదీ ఖరారు నేడే: డెత్ వారెంట్ జారీ చేసే ఛాన్స్
న్యూఢిల్లీ: యావత్ దేశాన్ని వణికించిన నిర్భయ అత్యాచారం కేసులో దోషులుగా తేలిన నలుగురికి పడిన ఉరిశిక్షను అమలు చేయడంలో నెలకొన్న జాప్యానికి బుధవారం తెర పడే అవకాశం కనిపిస్తోంది. ఉరి శిక్షను అమలు చేయడానికి అవసరమైన డెత్ వారెంట్ మరి కొన్ని గంటల్లో వెలువడొచ్చని తెలుస్తోంది. ఢిల్లీలోని పటియాలా హౌస్ న్యాయస్థానం ఈ డెత్ వారెంట్ ను జారీ చేయాల్సి ఉంది.
వెటర్నరి డాక్టర్ దిశ హత్యోదంతంతో చలనం..
నిర్భయపై అత్యాచారానికి పాల్పడిన ఆరుమందిలో నలుగురు ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. అక్షయ్ కుమార్ సింగ్, పవన్ కుమార్ గుప్తా, ముఖేష్ కుమార్, వినయ్ శర్మలకు ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉంది. హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద వెటర్నరి డాక్టర్ దిశ హత్యోదంతం, నిందితుల ఎన్ కౌంటర్ తరువాత నిర్భయ కేసులో దర్యాప్తు ముమ్మరమైన విషయం తెలిసిందే. నిర్భయపై అత్యాచారానికి పాల్పడి ఏడేళ్లు పూర్తయినప్పటికీ.. నిందితులు ఇంకా జీవించే ఉన్నారంటూ దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.
నేటికి వాయిదా..
తీహార్ జైలులో ఉంటోన్న నలుగురికీ ఉరిశిక్షను విధించడానికి అవసరమైన డెత్ వారెంట్ యుద్ధ ప్రాతిపదికన జారీ చేయాలంటూ కిందటి నెలలో నిర్భయ తల్లి ఆశాదేవి పటియాలా హౌస్ న్యాయస్థానంలో పిటీషన్ ను దాఖలు చేశారు. దీనిపై విచారణను జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది న్యాయస్థానం. ఆ తేదీ రానే వచ్చింది. ఈ మధ్యాహ్నం భోజన విరామం అనంతరం ఈ పిటీషన్ పై న్యాయస్థానం పునర్విచారణ చేపట్టనుంది. అనంతరం డెత్ వారెంట్ ను జారీ చేసే అవకాశం ఉంది.
రాష్ట్రపతికి క్షమాభిక్షకు అవకాశం ఇవ్వడంతో..
నలుగురు దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ కు సుప్రీంకోర్టు రాష్ట్రపతికి క్షమాభిక్షను కోరే అవకాశం కల్పించిన నేపథ్యంలో.. అతని వైఖరేమిటనేది వెల్లడించాలంటూ తీహార్ జైలు అధికారులకు న్యాయమూర్తి సతీష్ అరోరా నోటీసులను జారీ చేయడం వల్ల డెత్ వారెంట్ ను మంజూరు చేయడంలో జాప్యం చోటు చేసుకుంది. పటియాలా హౌస్ అదనపు సెషన్స్ న్యాయమూర్తి జస్టిస్ సతీష్ అరోరా ఈ నోటీసును జారీ చేశారు.