మీ మాటలు వింటుంటే గుండె పగులుతోంది.. మోదీగారైనా మాట నెలబెట్టుకోవాలి.. నిర్భయతల్లి ఆవేదన..
నిర్భయ దోషుల ఉరిశిక్ష వ్యవహారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలకు పావుగా మారింది. శిక్షలు ఆలస్యం కావడానికి ఆమ్ ఆద్మీ పార్టీనే కారణమని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆరోపిస్తే... రెండ్రోజులు ఢిల్లీ పోలీసుల్ని తమకు అప్పగిస్తే ఉరి తీసి చూపిస్తామని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సవాలు విసిరారు. ఏడేళ్ల తర్వాత కూడా ఒక ఆడపిల్లకు న్యాయం చేయాల్సిందిపోయి పార్టీలు ఇలా క్రెడిట్ కోసం పాకులాడటాన్ని నిర్భయ తల్లి ఆశాదేవి అసహ్యించుకున్నారు.

మమ్మల్ని వాడుకున్నారు..
నిర్భయ దోషులకు ఉరిశిక్ష అంశాన్ని బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు రాజకీయానికి వాడుకోవడం బాధాకరమని, ఆ పార్టీల నేతల మాటలు వింటుంటే గుండెలు పగిలిపోతున్నాయని నిర్భయ తల్లి ఆశాదేవీ ఆవేదన చెందారు. తన కూతురి చావును, తనను వాడుకున్నారేమో అనే ఫీలింగ్ కలుగుతోందన్నారు. ‘‘ఇప్పటిదాకా నేను రాజకీయాలు మాట్లాడలేదు. కానీ ఇప్పుడనిపిస్తోంది.. ఆ రోజు జెండాలు పట్టుకుని నిర్భయకు న్యాయం చేయాలని నినదించినవాళ్లందరూ ఫాయిదా కోసమే ప్రయత్నించారుతప్ప న్యాయం కోసం కాదని నాకనిపిస్తోంది''అని కన్నీటిపర్యంతమయ్యారు.

మోదీజీ.. మీరైనా..
2014 ఎన్నికల టైమ్ లో అప్పటి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ నిర్భయ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ.. ఆడపిల్లలకు రక్షణ కావాలంటే మోదీ సర్కార్ రావాలని పిలుపునిచ్చిన విషయాన్ని ఆశాదేవి గుర్తుచేశారు. ‘‘ మోదీజీ.. మీకు చేతులుజోడించి మొక్కుతున్నాను.. నిర్భయ విషయంలో మాకు, దేశానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి.. ఆ నలుగురు కీచకుల్ని జనవరి 22నే ఉరితీయండి''అని వేడుకున్నారు.

ఉరి ఖాయం..
నిర్భయ దోషులు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శుక్రవారం కొట్టేయడంతో ఉరిశిక్ష అమలు ఖాయమైపోయింది. అయితే జనవరి 22న ఉరితీయాలన్న కోర్టు తీర్పుపై స్టే వచ్చిన నేపథ్యంలో అదే రోజు ఉరితీత ఉంటుందా లేక తాజాగా మరోసారి డెత్ వారెంట్ జారీ చేసి ఫిబ్రవరి 5 లేదా 6 తేదీల్లో ఉరితీస్తారా అనేది తెలియాల్సిఉంది.












Click it and Unblock the Notifications