ఎగవేతదారుల నుంచి 13 వేల కోట్లు వసూలు చేసిన బ్యాంకులు- పార్లమెంటులో నిర్మల వెల్లడి
పార్లమెంటు శీతాకాల సమావేశాల విపక్షాల నిరసనల మధ్యే కొనసాగుతున్నాయి. ఇవాళ కూడా లోక్ సభతో పాటు రాజ్యసభలోనూ విపక్షాలు నిరసన తెలపడం, కేంద్రం పట్టించుకోకపోవడంతో ఇరుసభలూ వాయిదాల మధ్య కొనసాగుతున్నాయి. ఇందులో లోక్ సభలో ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక ప్రకటనలు చేశారు.
దేశంలో బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన దొంగలపై పార్లమెంటులో విపక్షాలు అడిగిన ప్రశ్నలకు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ జవాబిచ్చారు. బ్యాంకులు ఎగవేతదారుల నుంచి రుణాల మొత్తాన్ని వసూలు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆమె లోక్ సభకు వివరించారు. ఇందులో ఆమె ఎగవేతదారుల నుంచి బ్యాంకులు ఇప్పటివరకూ రూ.13,109 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వంటి ఇంటిదొంగలు బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి విదేశాల్లో దర్జాగా తిరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆర్ధికమంత్రి నిర్మల ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
అలాగే దేశంలో నిత్యావసరాల ధరల పెరుగుదలపైనా విపక్షాలు ప్రశ్నలు వేశాయి. ఇదే అంశంపై లోక్ సభలో విపక్షాలు కొన్ని రోజులుగా నిరసన కూడా తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఆర్ధికమంత్రి నిర్మల ఈ అంశంపై సమాధానం ఇచ్చారు. వంటనూనెలతో పాటు ఇతర నిత్యావసరాల ధరల మంటపై కేంద్రం నియమించిన మంత్రుల సాధికార బృందం చర్చించి ఓ పరిష్కారం చూపుతుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
మరోవైపు కేంద్రం ఇవాళ లోక్ సభలో ప్రవేశపెట్టిన ఎన్నికల సంస్కరణల బిల్లుపై విపక్షాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఇందులో ఓటర్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేసేందుకు ఉద్దేశించిన సంస్కరణ వ్యక్తుల గోప్యతకు భంగం కలిగిస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే దీనిపై చర్చ ప్రారంభం కాకుండానే విపక్షాలు ఈ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డీమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల సంస్కరణల బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్, ఎంఐఎం, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, ఆర్ఎస్పీతో పాటు పలు విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ కేంద్రం మాత్రం జమిలి ఎన్నికల దిశగా తీసుకొస్తున్న అతి పెద్ద సంస్కరణగా దీన్ని చెప్పుకుంటోంది.