బీహార్ ఎన్నికలు- వ్యూహం మార్చిన నితీశ్- కులాల స్ధానంలో మహిళా సమీకరణాలు
కుల సమీకరణాలకు పెట్టింది పేరైన బీహార్లో ఎన్నికలు వచ్చాయంటే జనం వాటి ఆధారంగానే నేతలకు ఓట్లు వేస్తుంటారు. అభ్యర్ధి, పార్టీల మంచి చెడులతో సంబంధం లేకుండా కులాలకు ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ ఈ సారి ఎన్నికల్లో కులాలు తనను గట్టెక్కించలేవనే అభిప్రాయానికి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వచ్చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన ఈసారి కుల సమీకరణాల స్ధానంలో మహిళా ఓటింగ్పై ఎక్కువగా ఆధాపడుతున్నారు.
2010 నుంచి నితీశ్ కుమార్కు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న మహిళల కోసం ఆయన ఎన్నో పథకాలు అమలు చేశారు. అందుకే ఆయన పార్టీ జేడీయూకి మహిళా ఓటు బ్యాంకు కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ వచ్చింది. 2005 ఎన్నికల్లో 54.85 శాతం మహిళల ఓట్లు సాధించిన నితీశ్ పార్టీ 2015 నాటికి దాన్ని 59.92కు పెంచుకుంది. 2019 లోక్సభ ఎన్నికల నాటికి అది 60 శాతానికి చేరిపోయింది. నితీశ్ అనుసరించిన మహిళా అనుకూల విధానాలే ఇందుకు కారణమని విశ్లేషకులు చెబుతారు.

2015లో నితీశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్య నిషేధంపై ఎన్నో విమర్శలు వచ్చినా అంతిమంగా అది ఆయనకు ఎంతో మేలు చేసింది. వీటితో పాటు ఆయన హయాంలో ప్రభుత్వ హయాంలో మహిళలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లు, జీవిక లాంటి సంక్షేమ పథకాల్లో మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యం కూడా మరో ప్రధాన కారణం. ఇప్పుడు ఈ అంశాలే బీహార్ ఎన్నికల్లో ఆయన్ను మరోసారి గట్టెక్కిస్తాయనే అంచనాలు ఉన్నాయి. నితీశ్ కూడా తన ప్రచారంలో పదేపదే వీటినే ప్రస్తావిస్తున్నారు.
నితీశ్ సొంత నియోజకవర్గం నలందలో సైతం ఆయనకు మహిళా ఓటు బ్యాంకు నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా ఏపీలో మహిళలకు డ్వాక్రా పథకాల తరహాలోనే స్వయం ఉపాధి కల్పించే జీవిక పథకం లబ్దిదారులుగా ఉన్న వారంతా ఆయనకు బలమైన ఓటుబ్యాంకుగా మారిపోయారు. ఇప్పుడు రాష్ట్రంలో వీరి మద్దతుతోనే అధికారం నిలుపుకునేందుకు నితీశ్ ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడెలా ఉంటాయో తెలియని కులసమీకరణాల కంటే మహిళా ఓటర్ల మద్దతుతోనే గట్టెక్కాలనేది నితీశ్ ఆలోచన.












Click it and Unblock the Notifications