ఎన్నికలెందుకు, మోడీ ప్రమాణంచేస్తే సరి: సర్వేపై నితీష్
పాట్నా: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే గెలుస్తుందన్న సర్వేల పైన బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) సీనియర్ నేత నితీష్ కుమార్ అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే గెలుస్తున్నప్పుడు ఇక ఎన్నికలు నిర్వహించడమెందుకని ఆసహనం వ్యక్తం చేశారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జెడి(యు)కు దారుణమైన ఫలితాలు ఎదురు కావచ్చని సర్వేలు చెప్పాయి. ఈ సర్వే నివేదికలపై నితీశ్ మండిపడ్డారు. సర్వేలు ఇలా పేర్కొనడం ఎన్నికల ప్రక్రియే అనవసరమని చెప్పడంతో సమానమేనని ఆయన అన్నారు. ఒకవేళ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ గెలుపొందడం ఖాయమైనప్పుడు ఎన్నికలు నిర్వహించడం ఎందుకన్నారు.

ఆదివారం పాట్నా నగర శివార్లలోని దీదార్ గంజ్లో జెడి(యు) సంకల్ప్ ర్యాలీల్లో భాగంగా జరిగిన చిట్టచివరి ర్యాలీలో మాట్లాడుతూ నితీశ్ అన్నారు. అంతేకాదు, ఒక వేళ ఒపీనియన్ పోల్స్ అంచనా ఆధారంగా తాము గెలుపొందామని బిజెపి అనుకుంటే అసలు ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయడం ఎందుకని, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు కదా అని ఎద్దేవా చేశారు. సర్వే నివేదికల ప్రకారం ఎన్నికల్లో తాము గెలుపొందామని నరేంద్ర మోడీ, బిజెపి అనుకుంటూ ఉంటే ఆయన నేరుగా వెళ్లి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు కదా? అన్నారు.
బీహార్లో తమ ప్రభుత్వం ఇప్పటికీ పాపులర్ అని, 68 శాతం మంది తన ప్రభుత్వం పట్ల విశ్వాసంతో ఉన్నారని ఓ పక్క సర్వేలు చెప్తూ, అయినప్పటికీ వాళ్లు వచ్చే ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని కూటమికి ఓటేస్తారని చెప్పడాన్ని నితీశ్ తప్పుబట్టారు. ఎన్నికల విశ్లేషకులు సర్వే చేసిన ప్రజలంతా తమ ప్రభుత్వం పట్ల సంతోషంగా ఉన్నప్పటికీ వాళ్లు ఎన్నికల్లో మరో కూటమికి ఓటేయడం ఎలా సాధ్యమని, ఈ అంచనా పరస్పర విరుద్ధం కాదా అన్నారు.












Click it and Unblock the Notifications