‘‘గంటలో ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకొస్తానన్నా వినలేదు.. నా తల్లిని చంపేశారు..’’
చండీగఢ్: ఓ కార్గిల్ యుద్ధవీరుడి భార్య సకాలంలో వైద్యం అందక మరణించింది. ఆమెకు ఆధార్ కార్డు లేదని వైద్యులు చికిత్స చేయలేదు. ఈ షాకింగ్ ఘటన హర్యానాలోని సోనిపట్లో జరిగింది.
సోనిపట్కు చెందిన పవన్ కుమార్ తన తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఇంటికీ సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా ఆసుపత్రి సిబ్బంది ఆమె ఆధార్ కార్డు అడిగారు.
పవన్ కుమార్ తన మొబైల్లో ఉన్న తల్లి ఆధార్ కార్డు సిబ్బందికి చూపించగా వారు ఒరిజినల్ కార్డు చూపించాలన్నారు. ఆధార్ కార్డు తెస్తేగాని వైద్యం చేయమని వైద్యులు కూడా స్పష్టం చేశారు.
''మీరు ట్రీట్మెంట్ చేస్తూ ఉండండి. నేను గంటలో ఇంటికెళ్లి మా అమ్మ ఆధార్ కార్డు తీసుకొస్తా..'' అని పవన్ కుమార్ ఎంత వేడుకున్నా వైద్యులు కనికరం చూపలేదు. ముందు డాక్యుమెంటేషన్ పూర్తయితేనే వైద్యం చేస్తామని తెగేసి చెప్పారు.
ఈ లోగానే అతడి తల్లి ప్రాణం పోయింది. సకాలంలో వైద్యం అందకే తన తల్లి మరణించిందని, ఆధార్ కార్డు తెస్తానని చెప్పినా వైద్యులు వైద్యం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని పవన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు.
అయితే ఆ ఆసుపత్రికి చెందిన ఓ వైద్యుడు ఈ ఘటనపై మాట్లాడుతూ అమితాశ్చర్యం వ్యక్తం చేశాడు. తమపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తి అసలు తమ ఆసుపత్రికి ఏ రోగినీ తీసుకురాలేదని, ఆధార్ కార్డు లేదని తాము ఎన్నడూ, ఎవరికీ వైద్యం చేయడానికి నిరాకరించలేదని వ్యాఖ్యానించాడు.