కరోనా : బెంగళూరులోని ఆ కాలనీలో రచ్చ రచ్చ.. సహించేది లేదని సీఎం వార్నింగ్..
కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. కొద్దిమందిలో మాత్రం ఇంకా మార్పు రావట్లేదు. వైద్య పరీక్షలకు సహకరించాలని ప్రభుత్వం మొత్తుకుంటున్నా.. అదేదో తమకు విధించిన శిక్షగా భావిస్తున్నారు. తాజాగా బెంగళూరులోని పాదారయణపురలో ఆశా వర్కర్లు,హెల్త్ కేర్ సిబ్బంది కరోనా టెస్టుల కోసం వెళ్లిన వేళ.. స్థానికులు రచ్చ రచ్చ చేశారు. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేసి నిరసన తెలిపారు. టెస్టుల కోసం వెళ్లినవారిని భయభ్రాంతులకు గురిచేసేలా స్థానికులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ ప్రాంతంలో 58 మంది సెకండరీ కాంటాక్ట్స్..
పాదారణపురలో అంతకుముందు 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ ప్రాంతాన్ని పోలీసుల సీల్ చేసి అన్ని దారులను బారికేడ్లతో మూసివేశారు. పాజిటివ్ పేషెంట్స్ ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్ను గుర్తించి వారిని క్వారెంటైన్ కేంద్రాలకు తలిస్తున్నారు. ఇందులో భాగంగా కొంతమంది ఆశా వర్కర్లు,హెల్త్ కేర్ సిబ్బంది ఆ ప్రాంతంలో గుర్తించిన 58 మంది సెకండరీ కాంటాక్ట్స్ను ఆదివారం రాత్రి ప్రభుత్వ క్వారెంటైన్ కేంద్రాలకు తరలించేందుకు వెళ్లారు. నిజానికి క్వారెంటైన్ కేంద్రాలకు వెళ్లేందుకు ఆ 58 మంది మొదట అంగీకరించారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు.. కాసేపటికే అక్కడి స్థానికులు బారికేడ్లను ధ్వంసం చేస్తూ నిరసనకు దిగారు.

సీఎం యడియూరప్ప వార్నింగ్
పాదారయణపురలో స్థానికుల దౌర్జన్యంపై ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తీవ్ర స్థాయిలో స్పందించారు.మొదట ఆశావర్కర్లకు అవసరమైన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని కమిషనర్ను ఆదేశించారు. కోవిడ్-19 వారియర్స్పై ఎటువంటి దాడిని సహించేది లేదని హెచ్చరించారు. బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించారు. అటు ఆరోగ్యమంత్రి బి.శ్రీరాములు కూడా దాడిని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి అమానుష ఘటనలను సహించేది లేదని.. ఆరోగ్య సిబ్బంది,పోలీసులపై కఠిన చర్యలు తప్పవని అన్నారు.
వారిని ఒప్పించిన స్థానిక ఎమ్మెల్యే
స్థానిక ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ జరిగిన ఘటనపై స్పందిస్తూ... 'అంతా చదువుకోని కూలీ జనం.. వాళ్లేం చేస్తున్నారో వారికే తెలియదు..' అని వ్యాఖ్యానించారు. దీంతో జమీర్ అహ్మద్ ఖాన్ వారి చర్యలను సమర్థిస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాదు,అర్ధరాత్రి సమయంలో ఆశావర్కర్లు,పోలీసులు అక్కడికి ఎందుకు వెళ్లినట్టు అని జమీర్ ఎదురు ప్రశ్నించినట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు. స్థానికులు అలా చేయడాన్ని తాను ఖండిస్తున్నానని చెప్పారు. పాదారయణపురకి వెళ్లి ఆ 58 మందిని కలిసి క్వారెంటైన్ కేంద్రాలకు వెళ్లాలని చెప్పినట్టు తెలిపారు. అందుకు వారు అంగీకరించినట్టు కూడా చెప్పారు.

54 మందిపై కేసులు నమోదు..
దౌర్జన్యానికి దిగినవారిలో 54 మందిని సీసీటీవి ఫుటేజీ ద్వారా గుర్తించి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 353,307,ఎన్డీఎంఏ 352,324,201ల కింద కేసులు నమోదు చేశారు. స్థానికంగా ఉండే ఫిరోజా అనే మహిళపై కూడా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా ఈ దాడిని ఖండించారు. కరోనాపై పోరులో డాక్టర్లు,పోలీసులు,హెల్త్ వర్కర్లు ముందుండి పోరాడుతున్నవేళ.. అన్ని వర్గాల ప్రజలు వారికి సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఫేక్ న్యూస్ పట్ల కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications