దీపావళి టపాసులపై నిషేధం లేదు: సుప్రీం
న్యూఢిల్లీ: దీపావళి పండగను పురస్కరించుకుని కాల్చే బాణాసంచాపై నిషేధాన్ని విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దసరా, దీపావళి రోజుల్లో బాణాసంచా వాడకంపై పూర్తి స్థాయి నిషేధం విధించాలని గత సెప్టెంబర్లో ముగ్గురు చిన్నారులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
ఆ పిటిషన్పై బుధవారం సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. పండుగ రోజున బాణాసంచా వినియోగంపై నిషేధం విధించడం సాధ్యం కాదని అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో స్పష్టం చేసింది. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు స్వేచ్ఛగా బాణాసంచా పేల్చుకోవచ్చుని కోర్టు పేర్కొంది.
అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాణాసంచా కాల్చడంతో వచ్చే కాలుష్యంపై ప్రజలకు అవగాహన పెంచే కార్యక్రమాలను ప్రదర్శించాలని ఆదేశించింది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 12 వరకు అవగాహన, చైతన్య ప్రకటనలు ప్రదర్శించాలని సూచించింది.

కాగా, అంతకుముందు బాణాసంచా తయారీదారులు కూడా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. బాణాసంచాపై నిషేధం విధించడం సరికాదని విజ్ఞప్తి చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా నిషేధం విధించడం లాంటి చర్యలకు దిగరాదని విన్నవించారు.
దీపావళి, స్వాత్రంత్య దినోత్సవం, నూతన సంవత్సరం, క్రిస్మస్, ఆటలు, ఎన్నికల్లో విజయాలు సాధించిన సందర్భాల్లో, వివాహాలు మొదలగు సందర్భాల్లో బాణాసంచా కాల్చడం జరుగుతుందని, వీటిపై నిషేధం విధించడం సబబు కాదని విజ్ఞప్తి చేశారు.
బాణాసంచా పరిశ్రమల కారణంగా సుమారు రూ. వెయ్యి కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోందని తెలిపారు. అంతేగాక, 3లక్షల మందికి ప్రత్యక్షంగా, 10లక్షల మందికిపైగా పరోక్షంగా ఉపాధి లభిస్తోందని వివరించారు. కాగా, కేంద్రం కూడా బాణాసంచా తయారీదారులకు మద్దతు పలుకుతూ, బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించరాదని విజ్ఞప్తి చేసింది.












Click it and Unblock the Notifications