25ఏళ్ల శివసేన దోస్తీకి బీజేపీ రాంరాం, కొత్త పొత్తు దిశగా
న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ, శివసేనల మధ్య సీట్ల విషయం కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది. 25 ఏళ్లుగా స్నేహ బంధంతో పెనవేసుకుపోయిన బీజేపీ, శివసేనలు విడిపోయాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాల విషయంలో ఇరుపార్టీల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. చివరకు మైత్రీ బంధాన్ని తెంచుకునేంత వరకు తీసుకెళ్లాయి.
ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో ఎవరికి వారే స్వతంత్రంగా పోటీ చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించుకున్నారు. తాము స్వతంత్రంగా పోటీ చేస్తామని బీజేపీ ప్రకటన కూడా చేసింది. ఇరుపార్టీల నేతల వ్యాఖ్యలు చూసినా బంధం విడిపోయినట్లుగానే అర్థమవుతోంది.
మహాయూటీ కూటమిని కాపాడుకోవడానికే తాము ప్రయత్నాలు చేస్తున్నామని 'మహా' బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రతిష్టంభన తొలగించేందుకు తాము ఎంతగానో కృషి చేశామని, చేస్తున్నామని చెప్పారు. శివసేనతో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. 22 రోజులుగా శివసేనతో చర్చించినా ఎలాంటి ఫలితం దక్కలేదంటున్నారు. ఇక తాము స్వతంత్ర నిర్ణయం తీసుకోక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అవినీతి కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి నుండి మహారాష్ట్రకు విముక్తి కలిగించాలనే తమ ప్రయత్నమని అన్నారు. పొత్తును విడగొట్టుకోవడం చాలా బాధాకరమే అన్నారు. తగిన నిర్ణయాలు తీసుకోకుంటే కాంగ్రెసు కూటమికి లాభం చేకూరే అవకాశముందన్నారు. పాతికేళ్ల అనుబంధం విడిపోవడం బాధాకరమే అవుతుందన్నారు. సేనను ఇప్పటికీ తాము మిత్రపక్షంగానే పరిగణిస్తున్నామన్నారు.
కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ తొందరపడుతోందని శివసేన ఆరోపించింది. తాము బీజేపీకి చివరిసారిగా ఆఫర్ చేస్తున్నామని, కలిసి ఉంటారో లేదో ఆ జాతీయ పార్టీ ఇష్టమని శివసేన ఘాటుగా స్పందిస్తోంది. అయితే, శివసేన, బీజేపీ కూటమి విచ్ఛిన్నమైనట్లేనని చెబుతున్నారు. అయితే, చివరి ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి.
రెండు పార్టీలదీ అదే మాట...
అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కుదరలేదని రెండు పార్టీలు చెబుతున్నాయి. విడివిడిగా పోటీ చేయాలని ఇరువర్గాలు నిర్ణయానికి వచ్చినట్లుగానే కనిపిస్తోంది. దీనికి బాధ్యత మీరంటే మీరని ఇరు పార్టీలు అంటున్నాయి. గురువారం రెండు పార్టీల మద్య మరోసారి చర్చలు జరిగాయి. కానీ అవి ఫలప్రదం కాలేదు.
మహారాష్ట్రలోని మాహాయూటీ కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారంలో బీజేపీ, శివసేన మద్య వారం రోజులుగా వివాదం నడిచింది. చివరికి బీజేపి అడిగిన 130 స్థానాలు ఇవ్వడానికి శివసేన ఒప్పుకుంది. కానీ ఇతర మిత్రపక్షాల్లో వాటాల నుంచి ఆ సీట్లు కేటాయించింది. ఆ సమీకరణానికి చిన్న పార్టీలు ఒప్పుకోవడం లేదు.
వారికి ఇప్పుడు అదనపు సీట్లు ఎక్కడి నుంచి కేటాయించాలన్న అంశంపై బీజేపీ-శివసేబ మధ్య ప్రతిష్ఠంభన నెలకొంది. రెండు పార్టీలు సీట్లు వదులుకోడానికి సిద్ధంగా లేవు. ఈ రగడ ముదిరి మొత్తానికి మైత్రీబంధానికే ముప్పు వాటిల్లే పరిస్థితి ఎదురైంది.
మరోవైపు కాంగ్రెస్-ఎన్సీపీ మధ్య కూడా సయోధ్య కుదరడంలేదు. ఆ కూటమి కూడా విడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్పీసీ ఇప్పుడు బీజేపీతో జత కట్టడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే, బీజేపీ మాత్రం చిన్న పార్టీలతో జతకట్టడమే కాకుండా రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications