వెనక్కి తగ్గిన కేంద్రం: ఆ కాన్సెప్ట్ క్యాన్సిల్: ఉత్తర్వులు ఉపసంహరణ
కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వాలంటైన్స్ డే నాడు కౌ హగ్ డే ను జరుపుకోవాలంటూ ఇదివరకు జారీ చేసిన సూచనలను ఉపసంహరించుకుంది.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వెనుకంజ వేసింది. ఆవుతో ఆలింగనం కాన్సెప్ట్ ను రద్దు చేసింది. వాలంటైన్స్ డే నాడు కౌ హగ్ డే ను జరుపుకోవాలంటూ ఇదివరకు జారీ చేసిన సూచనలను ఉపసంహరించుకుంది. ఈ కాన్సెప్ట్.. భారీగా విమర్శల గురైన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మేరకు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఆవుతో ఆలింగనం తప్పనిసరి కాదని తెలిపింది.
ఫిబ్రవరి 14వ తేదీని వాలంటైన్స్ డేగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు వాలెంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది భారతీయ సంస్కృతి కాదనే వాదనలు ఉన్నాయి. బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ వంటి హిందూ సంస్థలు దీనికి వ్యతిరేకం. ఇది భారతీయుల సంప్రదాయం కాదని, ఇలాంటివాటిని ప్రోత్సహించకూడదనేది వారి ఉద్దేశం.
అందుకే- వాలంటైన్స్ డే నాడు బజరంగ్ దళ్, వీహెచ్పీ నాయకులు పార్కుల్లో మోహరిస్తుంటారు. తమ కంటికి కనిపించిన ప్రేమజంటలను అప్పటికప్పుడు పెళ్లి చేస్తుంటారు. పార్కుల్లో లవర్స్ మీద వారు దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పోలీస్ స్టేషన్లల్లో పరస్పరం కేసులు నమోదు చేసుకున్న సంఘటనలు కోకొల్లలు.

ఈ పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 14వ తేదీని కౌ హగ్ డే గా జరుపుకోవాలంటూ దేశ ప్రజలను సూచించింది. ఈ మేరకు పశు సంవర్ధక శాఖ బోర్డ్ ఇవ్వాళ సర్కులర్ ను జారీ చేసింది. ఫిబ్రవరి 14వ తేదీ నాడు ప్రతి ఒక్కరు గోవును ఆలింగనం చేసుకోవాలని, మూగప్రాణుల పట్ల తమకు ఉన్న అనుబంధాన్ని చాటుకోవాలని పేర్కొంది.
గోవులు, ఇతర మూగజీవులను ప్రేమించడం భారత సంస్కృతిలో ఒక భాగమని గుర్తు చేసింది. హైందవ సంప్రదాయంలో గోవులకు ఎంతో ప్రాధాన్యత ఉందని, సాక్షాత్ భగవత్ స్వరూపంగా భావిస్తారని తెలిపింది. దేశంలో వైదిక సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అంతరించిపోవడానికి విదేశీ సంస్కృతి కారణమౌతోందని, దీన్ని అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరు ఫిబ్రవరి 14వ తేదీ నాడు వాలంటైన్స్ డే కు బదులుగా కౌ హగ్ డే ను జరుపుకోవాలని పశు సంవర్ధక శాఖ బోర్డ్ విజ్ఞప్తి చేసింది.
ఈ ఉత్తర్వులు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. సోషల్ మీడియా వేదికగా భారీగా మీమ్స్ పడ్డాయి. ఈ కాన్సెప్ట్ ను నెటిజన్లు ట్రోల్స్ చేశారు. ఇంటర్నేషనల్ టైగర్ డే నాడు పులులను కౌగిలించుకోవాలా? అంటూ ప్రశ్నలు సంధించారు. ప్రధాని ఆదేశాల మేరకు గతంలో దీపాలు వెలిగించాం, చప్పట్లు కొట్టాం.. ఇప్పుడు ఆవుతో సెల్ఫీ దిగాలా? అంటూ చురకలు అంటించారు. విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కౌ హగ్ డేను రద్దు చేసింది.












Click it and Unblock the Notifications