పార్లమెంట్ లో మరో వివాదాస్పద ఉత్తర్వు- ఇక ఎంపీల ధర్నాలకు నో పర్మిషన్..
పార్లమెంట్లో ఇప్పటికే తమ వాదన వినిపించే అవకాశం దక్కడం లేదంటూ విపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కేంద్రం వరుసగా మరిన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోంది. పార్లమెంటులో అన్ పార్లమెంటరీ పదాల్ని నిషేధిస్తున్నట్లు నిన్న ఉత్తర్వులు జారీ చేసిన అథికారులు.. ఇవాళ ఎంపీలకు మరో షాక్ ఇచ్చారు. ఇక పార్లమెంటులో ధర్నాలు కుదరవని తేల్చి చెప్పేశారు.
వర్షాకాల సమావేశాలకు ముందు పార్లమెంట్లో ధర్నాకు అనుమతి ఇవ్వబోమని కేంద్రం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.
రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ తాజా ఉత్తర్వుల ప్రకారం పార్లమెంటు సభ్యులు ఎటువంటి ధర్నా లేదా సమ్మె కోసం దాని ఆవరణను ఉపయోగించకూడదని పేర్కొన్నారు. పీసీ మోడీ ఆదేశాలలో సభ్యులు ఎటువంటి ప్రదర్శన, ధర్నా, సమ్మె, నిరాహారదీక్ష లేదా ఏదైనా మతపరమైన వేడుకల కోసం పార్లమెంటు హౌస్ ఆవరణను ఉపయోగించకుండా పోయింది. తమ నిర్ణయానికి అందరూ సహకరించాలని రాజ్యసభ సెక్రటరీ జనరల్ చివర్లో కోరారు.

నిన్న పార్లమెంటులో అన్ పార్లమెంటరీ పదాలుగా పేర్కొంటూ కొన్ని పదాల్ని వాడకుండా నిషేధం విధిస్తూ ఓ ప్రకటన వెలువడింది. దీనిపై ఎంపీల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడంతో ప్రత్యేకంగా నిషేధం అంటూ ఏమీ లేదని, అయితే తరచుగా వివాదాలకు కారణమవుతున్న పదాల్ని పార్లమెంటరీ పదాల జాబితా నుంచి తొలగించినట్లు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఎంపీలు అసలు ధర్నాలే చేయొద్దంటూ ఇచ్చిన ఉత్తర్వులపై ఎంపీలు ఎలా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications