అద్వానీ బోనెక్కాల్సిన సమయం: వచ్చి తీరాల్సిందేనన్న సీబీఐ ప్రత్యేక కోర్టు!
బాబ్రీ విధ్వంసం కేసులో ఈ ముగ్గురు నేతలు కుట్ర అభియోగాలు ఎదుర్కొంటున్నారు. కుట్ర అభియోగాలతో పాటు అన్ని విధాలుగా ఈ కేసు విచారణ జరపనున్నట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు తెలిపింది.
లక్నో: బాబ్రీ విధ్వంసం కేసులో బీజేపీ అగ్ర నేత అద్వానీ కోర్టు బోనెక్కాల్సిన సమయం ఆసన్నమైంది. కేసు పునర్విచారణలో భాగంగా కోర్టు హాజరు నుంచి మినహాయింపునివ్వడానికి సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. దీంతో ఈ నెల 30న అద్వానీ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది.
ఆయనతో పాటు బీజేపీ సీనియర్ నేతలు మురళీ మనోహర్ జోషి, కేంద్రమంత్రి ఉమాభారతి కూడా కోర్టుకు హాజరుకావాల్సిందేనని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.కాగా, బాబ్రీ విధ్వంసం కేసులో ఈ ముగ్గురు నేతలు కుట్ర అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
కుట్ర అభియోగాలతో పాటు అన్ని విధాలుగా ఈ కేసు విచారణ జరపనున్నట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు తెలిపింది. రెండేళ్లలో దీనికి సంబంధించిన విచారణ ప్రక్రియను పూర్తి చేయాలని గత నెలలో సుప్రీం ఆదేశించింది. ఇదిలా ఉంటే, రాష్ట్రపతి రేసు నుంచి అద్వానీని తనకు తానుగా తప్పుకునేలా చేసేందుకే మోడీ ఈ కుట్ర పన్నారని లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి నేతలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
దేశానికి ప్రధాని కావాలని కలలు కన్న అద్వానీ ఇప్పుడు బీజేపీ అగ్రనేతగా మాత్రమే మిగిలిపోయే పరిస్థితి తలెత్తింది. రాష్ట్రపతి పదవి దక్కుతుందని ఆశపడ్డ.. చివరకు బాబ్రీ కేసు వెంటాడంతో తనకు తానే రేసులో లేనని ప్రకటించేసుకున్నారాయన.