ఆగని పాక్ ఆగడాలు, గాల్లో కలిసిపోతున్న జవాన్ల ప్రాణాలు..‘సర్జికల్ స్ట్రయిక్స్’ వల్ల ఒరిగిందేమిటి?
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆగడాలు ఆగడం లేదు. సరిహద్దుల్లో ఆ దేశం నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ భారత జవాన్లపై కాల్పులు జరుపుతూనే ఉంది.
ఈ ఆగడాలు ఇంకెంత కాలం? అసలు పాకిస్తాన్ను ఎందుకు ఉపేక్షించాలి? ఎంత కాలం చేతలు కట్టుకుని కూర్చోవాలి. సర్జికల్ స్ట్రయిక్స్ అంటూ మనం గొప్పగా చంకలు గుద్దుకోవడమేకానీ అసలు ఆ ప్రభావం పాకిస్తాన్ కాస్తయినా ఉందా?

కొత్త ఏడాదికి హింసతో స్వాగతమా?
మరికొద్ది గంటల్లో కొత్త ఏడాదిలో ప్రవేశిస్తామనగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు హింసతో వెల్కం చెప్పారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం పుల్వామా జిల్లా లెత్పొరాలోని సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) క్యాంప్పై జైష్ -ఎ-మహ్మద్ ఉగ్రవాదులు దాడి జరిపి ఐదుగురు భారత జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. గ్రెనేడ్ లాంఛర్లు, ఆటోమేటిక్ ఆయుధాలు ధరించిన కొందరు ముష్కరులు ఆదివారం వేకువజామున సీఆర్పీఎఫ్ క్యాంప్ వద్దకు వచ్చీ రావటంతోనే విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. క్యాంప్ లోపలికి దూసుకెళ్లటానికి వారు చేసిన యత్నాలను సీఆర్పీఎఫ్ గార్డులు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు జవాన్లు అమరులు కాగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

2003లోనే ఒప్పందం కుదిరినా...
భారత, పాకిస్తాన్ దేశాల మధ్య మొత్తం 3,323 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. 2003లో ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయినా సరే పాకిస్తాన్ ఆగడాలు తగ్గుముఖం పట్టలేదు. పాక్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న ఉగ్రమూకను భారత్పైకి ప్రేరేపిస్తూనే ఉంది. 2017 డిసెంబర్ 10వ తేదీ వరకు నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పుల ఉల్లంఘన ఘటనలు 881 జరగ్గా, గత ఏడేళ్లలో ఇదే అత్యధికం. దీంతోపాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నవంబర్ వరకు మొత్తం 110సార్లు పాక్ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడింది. ఈ ఘటనల్లో 14 మంది సైనికులు, 12 మంది పౌరులు, నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు అమరులయినట్లు భారత సైన్యం తెలిపింది.

పాకిస్తాన్కు బుద్ధి చెప్పలేమా?
సరిహద్దుల్లో నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడే పాకిస్తాన్ విషయంలో ఎంతకాలం మనం సహనం ప్రదర్శిస్తూ ఉండిపోవాలి? పాక్కు దాని అనుబంధ ఉగ్రవాద సంస్థలకు బుద్ధి చెప్పలేమా? ఇవీ ప్రస్తుతం భారతీయుల గుండెల్లో ధ్వనిస్తోన్న ప్రశ్నలు. యూరీ ఉగ్రదాడి ప్రతి భారతీయుడికి ఇంకా గుర్తు ఉంది. తాజాగా జరిగిన పుల్వామా ఉగ్రదాడి భారతీయుల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంది. ఇంత సైన్యం, ఇన్ని ఆయుధాలు ఉండి మాత్రం ఏం ప్రయోజనం.. భారతీయ జవాన్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే అనే ఆవేదన ప్రతి భారతీయుడి గుండెల్లోంచి ధ్వనిస్తోంది. మరి ప్రజల ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ఢిల్లీ గద్దెనెక్కిన పాలకులే. ఇప్పటికైనా అడుగు ముందుకేస్తారా? నక్కజిత్తులమారి పాకిస్తాన్కు బుద్ధి చెబుతారా?

సర్జికల్ స్ట్రయిక్స్ వల్ల ఒరిగిందేమిటి?
పాకిస్తాన్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో భారత్ పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆ మధ్య సర్జికల్ స్ట్రయిక్స్ చేపట్టింది. 2017 సెప్టెంబర్ 28వ తేదీన జరిగిన ఈ ఆపరేషన్లో భాగంగా పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలోకి ప్రవేశించిన భారత సైన్యం అక్కడి ఉగ్రవాద శిబిరాలపై లక్షిత దాడులు చేసి తిరిగి భారత భూభాగంలోకి వచ్చేసింది. భారత్ చర్యతో పాకిస్తాన్ నివ్వెరపోయింది. చాలాకాలం వరకు భారత్ సర్జికల్ స్ట్రయిక్స్ జరిపిందనే విషయాన్నే ఆ దేశం ఒప్పుకోలేదు. సర్జికల్ స్ట్రయిక్స్ ఓ బూటకం అంటూ కొట్టిపారేసింది. లోలోపల మాత్రం పళ్లు కొరుకుతూ ఉండిపోయింది. మాటలు, హెచ్చరికల రూపంలో తన కసిని వెళ్లగక్కింది. అంతేకాదు, తన అక్కసును, ఆగ్రహాన్ని తిరిగి ఉగ్రదాడుల రూపంలో భరత జవాన్లపై చూపిస్తూనే ఉంది.

నాటి మోడీ మాటలు ఏమయ్యాయి?
పుల్వామా సీఆర్పీఎఫ్ క్యాంపుపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడి ప్రధాని మోడీ విదేశాంగ విధానం వైఫల్యానికి నిదర్శనమని కాంగ్రెస్ మండిపడింది. దేశ విరోధులకు గట్టిగా బుద్ధి చెబుతామని ఆనాడు ఎన్నికల సమయంలో చెప్పిన మోడీ మాటలు ఏమయ్యాయని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుశ్మితా దేవ్ ప్రశ్నించారు. ఒకవైపు పాకిస్తాన్ బద్ధ శత్రువంటూ ప్రకటనలు ఇస్తూ.. మరోవైపు వారితో చర్చలు, ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.

అసలు పాకిస్తాన్ పట్ల మీ వైఖరేమిటి?
కాంగ్రెస్ మరో అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ కూడా బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ను కట్టిడి చేసేందుకు మోడీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలేవీ సత్ఫలితాలను ఇవ్వటం లేదన్నారు. బీజేపీ హయాంలో దేశ రక్షణ ప్రశ్నార్థకంగా మారిందని, ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ‘అసలు పాకిస్తాన్ పట్ల మీ వైఖరేమిటో చెప్పండి..' అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు. పదే పదే దాడులు జరుగుతున్నాయని, అంతేకాకుండా వీటి సంఖ్య పెరుగుతోందని అన్నారు. పాకిస్తాన్ మన దేశంలోకి ప్రవేశించిందని, మనవాళ్ళను చంపుతోందని అన్నారు. మనం వాళ్ళకు జవాబు చెప్పలేమా? అని సందీప్ దీక్షిత్ సూటిగా ప్రశ్నించారు.
-
మొదటి రోజే పరువు పాయే! తెల్ల బంతి కాస్తా గులాబీగా మారింది! -
యుద్ధం వేళ.. భారత్ కు అదానీ బిగ్ బూస్ట్.. 2 వేల మెషిన్ గన్ లు డెలివరీ.. -
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
భారత్లోకి " పైప్డ్ " గ్యాస్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది కూడా అయిపోతుందా?? -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!











Click it and Unblock the Notifications