కేరళ: 600కోట్లు విడుదల చేసిన కేంద్రం, పునర్నిర్మాణ పనుల్లో అండగా, జీఎస్టీ లేదు
న్యూఢిల్లీ: భారీ వర్షలు, వరదలతో తల్లడిల్లిన కేరళకు కేంద్ర ప్రభుత్వం రూ. 600 కోట్లు విడుదల చేసింది. కేరళ వరదలను తీవ్ర ప్రకృతి విపత్తుగా ప్రకటించిన కేంద్రం ఆ దిశగా వరద సాయం కింద మంగళవారం ఈ నిధులను విడుదల చేసింది.
కేరళకు అదనంగా బియ్యం, పప్పు ధాన్యాలు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆ రాష్ట్రానికి తరలించే వరద సహాయ సామాగ్రి, ఆహార పదార్ధాలపై జీఎస్టీ మినహాయింపును ప్రకటించింది.
భారీ వర్షాలు తగ్గుముఖం పట్టిన క్రమంలో విద్యుత్, టెలికాం సేవల పునరుద్ధరణపై కేంద్రం ప్రధానంగా దృష్టిసారించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తక్షణమే మౌలిక సేవల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. ఎల్పీజీ సిలిండర్ల పంపిణీకి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ సమావేశంలో కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకుంది. కాగా, వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళను అన్నివిధాలా ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ప్రకటించారు. ఇక పలు రాష్ట్రాల సీఎంలు, నేతలు, సినీ నటులు, పారిశ్రామిక వేత్తలు భారీ విరాళాలతో ముందుకొస్తున్నారు.
కేరళకు సాయం చేస్తే..: జీఎస్టీ లేదు
ఇతర రాష్ట్రాల నుంచి కేరళ రాష్ట్రానికి పంపే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ, జీఎస్టీని తీసివేస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. దీనిపై తదుపరి నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించిన తర్వాత వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ నిబంధన డిసెంబర్ 31, 2018 వరకు వర్తిస్తుందని ఆయన వివరించారు.
ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను తగ్గించాల్సిందిగా కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాశారు. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేరళలో ఇప్పటికే సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. దెబ్బతిన్న గ్రామాల్లో 90 శాతం ఫోన్ కనెక్టివిటీ పునరుద్దరించినట్లు అధికారులు వెల్లడించారు.