రామ మందిర నిర్మాణానికి కొత్త ట్రస్ట్ అవసరం లేదు: రామ జన్మభూమి న్యాస్
అయోధ్య: రామ జన్మభూమి న్యాస్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రామ మందిర నిర్మాణం కోసం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్త ట్రస్ట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
రామ జన్మభూమి న్యాస్ ఉండగా మరో కొత్తది అవసరం లేదని గోపాల్ దాస్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అవసరమైతే దీనికో రూపు తీసుకొస్తామని.. కొత్త సభ్యులను కూడా ఇందులో చేర్చుకుంటామని వివరించారు. విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) ఆధ్వర్యంలోనే రామ జన్మభూమి న్యాస్ నడుస్తున్న విషయం తెలిసిందే.
మరో వైపు కొత్త ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. కొత్త ట్రస్ట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు చెప్పిందని.. ఆ ప్రకారమే ట్రస్ట్ నెలకొల్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని దిగంబర్ అఖాడా చీఫ్ మహంత్ సురేష్ దాస్ వ్యాఖ్యానించారు. న్యాస్ సభ్యులు ట్రస్ట్ ప్రతినిధులుగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇది ఇలావుంటే, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ట్రస్ట్ ఏర్పాటు చేయాలని, ఆ ట్రస్టులో అఖాడా సభ్యులకు రిజర్వేషన్ కల్పించాలని నిర్మోహి అఖాడా చీఫ్ మహంత్ దినేంద్రదాస్ పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే ట్రస్టులో ప్రభుత్వ ప్రతినిధులు ఉండాలని, ఆ ట్రస్టుకు మహంత్ నృత్య గోపాల్ దాస్ను అధ్యక్షుడిగా నియమించాలని సుప్రీంకోర్టులో వాదించిన వీహెచ్పీ ప్రతినిధి త్రిలోక్ పాండే అన్నారు.
అంతేగకా, వీహెచ్పీ సూచించిన నమూనాలోనే ఆలయ నిర్మాణం జరగాలని, వీహెచ్పీ రూపొందించిన రాళ్లతోనే ఆలయాన్ని కట్టాలని త్రిలోక్ పాండే కోరారు. అంతేగాక, ట్రస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత హిందువుల నుంచి విరాళాలు సేకరించాలని, ప్రభుత్వ నిధులను వినియోగించరాదని పాండే అభిప్రాయపడ్డారు. కొత్తగా ఏర్పాటయ్యే ట్రస్టులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉండాలని వీహెచ్పీ నేత శరద్ శర్మ సూచించారు.