జయలలితకు వారసులు లేరు: కలెక్టర్, వేదనిలయంలో రహస్య గదులపై..
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఎవరు కూడా వారసులు లేరని చెన్నై జిల్లా కలెక్టర్ అన్భుసెల్వన్ ప్రకటించారు. ఆమెకు ప్రత్యక్షంగా వారసులు ఎవరూ లేరన్నారు. నాలుగు నెలల్లోపు వేదనిలయాన్ని పూర్తిగా ప్రభుత్వ గుప్పెట్లోకి తీసుకుంటామన్నారు.
వేద నిలయంలో రహస్య గదులు, అండర్ గ్రౌండ్లో ప్రత్యేక గదులు ఉన్నాయా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. పోయెగార్డెన్లోని దివంగత సీఎం జయలలిత నివాసం వేదనిలయాన్ని స్మారక మందిరంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
వేద నిలయం స్వాధీనానికి కసరత్తు
దీంతో ఆ భవనం స్వాధీనానికి తగిన కసరత్తును చెన్నై జిల్లా కలెక్టర్ అన్భుసెల్వన్ చేపట్టారు. ఆయన నేతృత్వంలో ఇరవై మందితో కూడిన బృందం వేద నిలయాన్ని పరిశీలిస్తోంది. ఇప్పటికే ఆ భవనం, స్థలం వివరాలు, ఆస్తి విలువ లెక్కింపు తదితర ప్రక్రియలు ముగించారు. ఇక్కడి రెండు గదులను ఆదాయ పన్ను శాఖ వర్గాలు సీజ్ చేయడంతో, అందులో ఏముందో పరిశీలించాల్సి ఉంది.
తెరపైకి దీప, దీపక్, అమృత
శనివారం వేద నిలయంలో పరిశీలన అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. జయలలిత ఆస్తులకు తామంటే తాము వారసులు అని ఆమె మేనకోడలు దీప జయకుమార్, మేనళ్లుడు దీపక్ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అలాగే, తానే అమ్మ బిడ్డనంటూ బెంగళూరుకు చెందిన అమృత తెర మీదకు వచ్చింది. ఈ పరిస్థితుల్లో జయలలితకు ప్రత్యక్షంగా ఎలాంటి వారసులు లేరని కలెక్టర్ అన్భుసెల్వన్ స్పష్టం చేశారు.
ఆ తర్వాత స్మారక మందిరంగా
జయలలిత నివాసం విలువ లెక్కింపు ప్రక్రియ ముగింపు దశలో ఉందని, ఆ భవనాన్ని పూర్తిగా ప్రభుత్వం గుప్పెట్లోకి నాలుగు నెలల్లోపు తీసుకుంటుందని కలెక్టర్ చెప్పారు. అనంతరం ప్రభుత్వం స్మారక మందిరంగా ప్రకటిస్తుందని చెప్పారు.ప్రత్యక్షంగా అమ్మకు వారసులు ఎవరు లేరన్నారు.
ఆ రెండు గదులు మాకు అప్పగిస్తారు
నిబంధనల మేరకు అన్ని ప్రక్రియలు ముగించి, పబ్లిక్ నోటీసు జారీ చేస్తామని కలెక్టర్ చెప్పారు. అప్పుడు ఎవరైనా ఆక్షేపణ వ్యక్తం చేసినా ఆధారాలతో వచ్చినా ఆ సమయంలో అందుకు తగ్గ నిర్ణయాలతో లెక్కింపుకు తగ్గట్టు వెల కడతారన్నారు. ఆదాయ పన్ను శాఖ వర్గాలు తమకు సహకరిస్తాయని, ఆ రెండు గదులను త్వరితగతిన తమకు అప్పగిస్తారని భావిస్తున్నట్టు చెప్పారు.
వాటికి సమాధానం చెప్పలేదు
మరికొన్ని ప్రశ్నలను ఆయన దాటవేశారని తెలుస్తోంది. వేదనిలయంలో రహస్య గదులు ఉన్నట్టు, పాతాళంలోనూ గదులు ఉన్నట్టు సంకేతాలు వస్తున్నాయని, వాటిని చూశారా అని ప్రశ్నించగా.. ఆయన సమాధానం చెప్పలేదని తెలుస్తోంది.