మోడీయే కాదు, ఎవరూ ప్రశ్నించలేరు: మన్మోహన్ ఘాటు రిప్లై
న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో పాకిస్తాన్ అధికారులను తాను కలిసినట్లు ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఆరోపణపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మౌనాన్ని వీడి మోడీకి ఘాటుగా సమాధానం ఇచ్చారు.
గుజరాత్లో ఓడిపోతామనే భయంతో మోడీ రాజకీయ ప్రయోజనాల కోసం తనపై తప్పుడు ఆరోపణలు చేయడం తనను తీవ్రంగా బాధించిందని ఆయన అన్నారు. నరేంద్ర మోడీతో పాటు ఎవరు కూడా తాను దేశానికి చేసిన సేవలను ప్రశ్నించలేరని ఆయన అన్నారు.
గత ఐదు దశాబ్దాల పాటు దేశ ప్రజలకు తాను చేసిన సేవలు ప్రతి ఒక్కరికీ తెలుసునని అన్నారు. తన జాతీయ భావాన్ని కాంగ్రెసు ఓ పార్టీ నుంచి గానీ ప్రధాని నుంచి గుర్తించాలని కోరుకోవడం లేదని, ఉగ్రవాదంపై ఎవరు రాజీ పడ్డారో అందరికీ తెలుసునని ఆయన అన్నారు.
ఉద్దంపూర్, గుర్దాస్పూర్ల్లో ఉగ్రవాద దాడుల తర్వాత ఆహ్వానం లేకుండా మోడీ పాకిస్తాన్ను సందర్శించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పొరుగు దేశం ప్రేరేపించడంతో జరిగిన దాడిపై విచారణ కోసం పఠాన్కోట ఎయిర్బేస్కు పాకిస్తాన్ ఐఎస్ఐని ఎందుకు ఆహ్వానించారో మోడీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
గుజరాత్ ఎన్నికలపై తాను, మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్ అధికారులతో చర్చలు జరిపినట్లు, అహ్మద్ పటేల్ను ముఖ్యమంత్రిగా చేయాలని కుట్ర చేసినట్లు మోడీ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. భారత్, పాకిస్తాన్ సంబంధాలపై మాత్రమే తాము చర్చలు చేశామని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెసు పార్టీపై, దాని నాయకులపై చేసిన ఆరోపణలకు మోడీ జాతికి క్షమాపణ చెప్పి, ఆయన నిర్వహి్తున్న పదవి హుందాతనాన్ని కాపాడుతారని ఆశిస్తున్నట్లు మన్మోహన్ సింగ్ అన్నారు.