వ్యాక్సినేషన్ లో బలవంతం లేదు - సుప్రీంలో కేంద్రం అఫిడవిట్ : థర్డ్ వేవ్ వేళ..!!
వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంలో ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. తొలి విడత కరోనా కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో..సెకండ్ వేవ్ సమయంలలో దేశ వ్యాప్తంగా రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. కోవాగ్జిన్.. కోవీషీల్డ్ వ్యాక్సిన్ల ద్వారా ఇప్పటి వరకు దాదాపుగా 176 కోట్ల మేర వ్యాక్సిన్లు పంపిణీ చేసారు. ప్రస్తుతం థర్డ్ వేవ్ కేసులు భారీ స్థాయిలో ఉన్నా మరణాల సంఖ్య అదుపులో ఉండటానికి వ్యాక్సినేషన్ భారీ స్థాయిలో పంపిణీ చేయటమే కారణమని నిపుణులు చెబుతున్నారు.
కరోనా కట్టడికి వ్యాక్సినేషన్
ప్రధాని మొదలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు..అధికారులు సైతం వ్యాక్సినేషన్ ద్వారానే కరోనా నియంత్రించగటమంటూ ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం నిరంతరం చేస్తున్నారు. ర్హులైన ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకోకుంటే జరిమానా విధిస్తామని చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ను తప్పనిసరి చేశారు. మాస్క్ తప్పనిసరి. ఇక ఇదిలా ఉంటే, వ్యాక్సినేషన్పై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
సుప్రీం ఆదేశాలతో తాజా నిర్ణయం
వ్యాక్సిన్ తీసుకోవడం వ్యక్తికి సంబంధించిన సొంత విషయం అని, ఎట్టి పరిస్థితుల్లో బలవంతంగా వ్యాక్సిన్ వేయకూడదని ఆదేశించింది. దీంతో..తాజాగా సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని మాత్రమే కేంద్రం చెబుతుందని, దీనికి సంబంధించి మీడియా, సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్ల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చామని పేర్కొంది. ఏ ఒక్కరినీ వారి ఇష్టానికి వ్యతిరేకంగా వ్యాక్సిన్ వేసే ప్రయత్నం చేయలేదని స్పష్టం చేసింది. ఎవరి పైనా ఒత్తిడి చేయబోమని హామీ ఇచ్చింది.
ఎవరిని వ్యాక్సిన్ కోసం ఒత్తిడి చేయం
వ్యాక్సిన్ ద్వారా కరోనా నుంచి ప్రాణాపాయం తప్పించుకోవచ్చని మాత్రమే సూచిస్తున్నామని...అదే సమయంలో వ్యాక్సిన్ తీసుకోవటం వారి వ్యక్తిగత ఇష్టం పైన ఆధారపడి ఉంటుందని కేంద్రం పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దేశంలో థర్డ్ వేవ్ ఎంటర్ అయింది. కేసులు భారీగా పెరుగుతున్నాయి. చాలా మంది వ్యాక్సిన్పై ఉన్న అపోహలు ఇతర కారణాల వలన వ్యాక్సిన్ను తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దీంతో..అవగాహన పెంచటమే కానీ... బలవంతంగా ఎవరికీ వ్యాక్సినేషన్ చేయబోమని కేంద్రం స్పష్టత ఇచ్చింది.