ఆధారాల్లేవు: ఉగ్రవాది హఫీజ్ను ఏంచేయలేమన్న పాక్
న్యూఢిల్లీ: ముంబై బాంబు పేలుళ్లకు ప్రధాన సూత్రధారి అయిన ఉగ్రవాది, జమాతే ఉద్ దవా చీఫ్ హఫీజ్ సాయిద్ను భారత జర్నలిస్టు వేద్ ప్రతాప్ వైదిక్ కలవడంపై పాకిస్థాన్ ప్రభుత్వం తొలిసారి స్పందించింది. వారిద్దరి భేటీ పట్ల తమకు ఎలాంటి సమాచారం అందలేదని శుక్రవారం తెలిపింది. ముంబై పేలుళ్లకు పాల్పడినట్లు ఆధారాలు ఏమి లేవు కాబట్టి హఫీజ్పై ఎలాంటి చర్యలు తీసుకోమలేమని స్పష్టం చేసింది.
భారతదేశానికి వచ్చిన పాకిస్థాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ ఇక్కడి మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. హఫీజ్ సాయిద్, వైదిక్ల భేటీపై స్పందిస్తూ.. వారి భేటీపై తమ ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదని, అది ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల భేటీ తప్ప మరేమి లేదని చెప్పారు. భారత ప్రభుత్వం కూడా ఈ విషయంపై తమకు ఎలాంటి సమాచారం అందించలేదని తెలిపారు.
పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ అయిన ఐఎస్ఐకి కూడా ఈ విషయం తెలియదా అని ప్రశ్నించగా.. దీనిపై పాకిస్థాన్ ప్రభుత్వం ఏమి చేయలేదని అన్నారు. హఫీజ్ సాయిద్ ఉద్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు కదా అని మీడియా ప్రశ్నించగా.. హఫీజ్ను ప్రాసిక్యూట్ చేసేందుకు తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు.
హఫీజ్ సాయిద్ను జైలులో పెట్టాలంటే పాకిస్థాన్ ప్రభుత్వానికి బలమైన ఆధారాలు కావాలని అబ్దుల్ బాసిత్ అన్నారు. తాము అతడ్ని జైలు పెట్టలేమని చెప్పిన ఆయన, దయచేసి ఎవరైనా ఆధారాలు ఉంటే చెప్పాలని ప్రశ్నించారు. పాకిస్థాన్ వచ్చేందుకు ప్రతాప్ వైదిక్ మరోసారి వీసా కోసం అప్లై చేసినా తాము మంజూరు చేస్తామని చెప్పారు. పలు సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన ఇతర ప్రముఖులతోపాటు ఇక్కడికి తరచూ వస్తుంటారని తెలిపారు.
భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపిన యోగా గురువు బాబా రాందేవ్ సన్నిహితుడైన వేద్ ప్రతాప్ వైదిక్ తన పాకిస్థాన్ పర్యటనలో భాగంగా ఇటీవల హఫీజ్ సాయిద్తో భేటీ అయిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి కూడా. పాకిస్థాన్లోని భారత హై కమిషన్ నుంచి దీనిపై సమాచారం తీసుకోవాలని పట్టుబట్టాయి. కాగా, వీరి భేటీ విషయం హై కమిషన్కు తెలియదని భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ గురువారం తెలిపారు.