ప్రధాని నరేంద్ర మోడీకే ఆ ప్రముఖ హోటల్లో గది దొరకలేదు, మరో హోటల్లో బస
మైసూరు: మన దేశంలో ప్రధానమంత్రికే కాదు, ముఖ్య నేతలకు వారు కావాలనుకుంటే ఏ హోటల్లో అయినా గది సులభంగా దొరుకుతుందని అందరూ భావిస్తారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీకే ప్రఖ్యాత హోటల్లో గది దొరకలేదు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచే విషయం కావొచ్చు. కానీ వాస్తవం.
ప్రధాని మోడీ, ఆయన అనుచరులు బస చేసేందుకు హోటల్ గదులు ఇవ్వలేమని చెబుతూ మైసూరులోని ప్రముఖ హోటల్ లలితా మహల్ ప్యాలెస్ చేతులెత్తేసింది. ఇందుకు కారణం ఆ హోటల్ గదులన్నీ ముందే బుక్ కావడమే కారణం.
హోటల్కు వచ్చి అడిగితే గదులు లేవు
ప్రధానమంత్రి మోడీ, ఆయన అనుచరులు, భద్రతా సిబ్బంది బస చేసేందుకు హోటల్లో గదులు కావాలని డిప్యూటీ కమిషనర్ కార్యాలయం అధికారి ఒకరు తమ హోటల్కు వచ్చి సంప్రదించారని, అయితే వారికి రూములు ఇచ్చే పరిస్థితుల్లో తాము లేమని హోటల్ మేనేజర్ మాథియాస్ తెలిపారు.
అప్పటికే హోటల్లోని గదులు బుక్ అయిపోయాయి
అప్పటికే తమ హోటల్లోని గదులు అన్ని కూడా పెళ్లి విందుల కోసం బుకింగ్ అయిపోయాయని మేనేజర్ చెప్పారు. కేవలం మూడు గదులు మాత్రమే మిగిలి ఉన్నాయని, అవి వారికి సరిపోవని తెలిపారు. అందుకే వారికి గదులు ఇవ్వలేకపోయామని చెప్పారు.
భద్రతా కారణాల వల్ల మూడింటికి నో
భద్రతా కారణాల వల్ల కేవలం మూడు గదులను బుక్ చేసుకోవడానికి వారు ముందుకు రాలేదని హోటల్ మేనేజర్ మాథియాన్ తెలిపారు. దీంతో మూసురు అధికారులు హుటాహుటిన రాడిసన్బ్లూలో ప్రధాని బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కర్నాటక ఎన్నికల నేపథ్యంలో మోడీ రెండు రోజుల పాటు కర్నాటకలో పర్యటించి ప్రచారం చేస్తున్నారు.
రెండో హోటల్లోను దాదాపు అదే పరిస్థితి
హోటల్ రాడిసన్బ్లూలోను ఓ విధంగా అలాంటి పరిస్థితే తలెత్తింది. ఓ వ్యాపారవేత్త కుటుంబం వెడ్డింగ్ రిసెప్షన్ ఉంది. అయితే, మోడీ పర్యటన ఉందని, హోటల్లో దిగుతున్నారని, కాస్త ప్రత్యామ్నాయం చూసుకోవాలని కోరడంతో వారు అంగీకరించడంతో రెండో హోటల్ ఓకే అయింది.