రైతులపై దేశ ద్రోహం, యూఏపీఏ కేసులు -మోదీ సర్కార్ క్లారిటీ -విపక్షాలకు మెదడు లేదన్న మంత్రి తోమర్
వ్యవసాయ రంగంలో భారీ సంస్కరణలంటూ మోదీ సర్కార్ తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల పోరాటం కొనసాగుతున్నది. గడిచిన తొమ్మిది నెలలుగా నిరసనలో కూర్చున్న వేలాది మంది రైతులు.. ఇంకో రెండేళ్లయినాసరే, కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకునే దాకా ఉద్యమం కొనసాగిస్తామని చెబుతున్నారు. కాగా, సాగు చట్టాలను వ్యతిరేకంగా ఉద్యమిస్తోన్న రైతులపై టెర్రరిస్టులపై మోపే దేశ ద్రోహం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద కేసులు మోపారన్న అనుమానాలకు కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది..
వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గడిచిన 9 నెలలుగా నిరసనలు చేస్తోన్న రైతులపై దేశ ద్రోహం లేదా యూఏపీఏ చట్టం కింద కేసులు నమోదు చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది. రైతులపై దేశ ద్రోహం కేసులు పెట్టారా అన్న ఎంపీల ప్రశ్నకు కేంద్ర హోం శాఖ బుధవారం నాడు రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానం చెప్పింది.
''ఢిల్లీ పోలీసుల వివరణ ప్రకారం, రైతులపై ఇప్పటి దాకా దేశ ద్రోహం, యూఏపీఏ కేసులు పెట్టలేదు. అయితే, గతేడాది నవంబర్ నుంచి 2021 జులై దాకా మొత్తం 183 మంది రైతులు వివిధ సందర్భాల్లో అరెస్టయ్యారు. కానీ వారంతా ఇప్పుడు బెయిల్ పై బయటే ఉన్నారు'' అని కేంద్ర హోం శాఖ రాజ్యసభలో సమాధానమిచ్చింది. రిపబ్లిక్ డే(జనవరి 26)న ఢిల్లీలో రైతులు చేసిన ట్రాక్టర్ల ర్యాలీలోకి బీజేపీ శ్రేణులు చొరబడటం, నటుడు దీప్ సిద్ధు ఎర్రకోట వద్ద జాతీయ జెండాను తొలగించిన ఘటనలో ఢిల్లీ పోలీసులు ఏకంగా 3,224 పేజీల చార్జిషీటు రాసి, అందులో తీవ్రమైన నేరాలనూ మోపడం తెలిసిందే. అయితే కేంద్రం మాత్రం తీవ్రమైన కేసులేవీ లేవని ఇప్పుడు క్లారిటీ ఇవ్వడం గమనార్హం. మరోవైపు..
సాగు చట్టాలు, పెగాసస్ నిఘా కుట్ర ఉదంతాలపై బుధవారం నాడు పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. సాగు చట్టాలపై చర్చకు కేంద్రం వెనుకడుగు వేస్తున్నదని, పెగాసస్ నిఘా కుట్రకు పాల్పడిందే కేంద్రమని విపక్ష నేతలు భగ్గుమన్నారు. సభలో గలాటా చోటుచేసుకోగా, పలువురు విపక్ష ఎంపీలపై వేటు పడింది. సాగు చట్టాల విషయంలో తాము పూర్తి పారదర్శకంగా, స్పష్టంగానే ఉన్నామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు.
Recommended Video
వ్యవసాయ చట్టాల విషయంలో ప్రతిపక్షాలే అయోమయంలో ఉన్నాయని, సాగు చట్టాలేమిటో, వాటిపై వారికున్న అభ్యంతరాలేమిటో, సభలో ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారో, అసలు వారికేం కావాలో వారికే అర్థం కావడం లేదని కేంద్ర వ్యవసాయ మంత్రి ఎద్దేవా చేశారు. సాగు చట్టాలపై ఇప్పటికే పార్లమెంటు(రాజ్యసభ)లో నాలుగు గంటలకుపైగా చర్చించామని, వీటికి సంబంధించి విపక్షాలు అడిగిన ప్రశ్నలకు జవాబులు కూడా ఇచ్చామని, సందేహాలను నివృత్తి చేసిన తర్వాత కూడా విపక్షాలు అయోమయంలో ఉన్నాయని తోమర్ అన్నారు.