టాయిలెట్ కట్టించలేదని విడాకులిచ్చిన భార్య, నిజమే కానీ: భర్త
పాట్నా: తన భర్త టాయిలెట్ కట్టించలేదని ఓ మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చిన సంఘటన బీహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఈ విషయాన్ని మంగళవారం అధికారులు చెప్పారు. సునితా దేవి అనే మహిళ వైశాలీ జిల్లా పహర్బూర్ గ్రామానికి చెందిన వారు.
టాయిలెట్ కట్టించమని తన భర్తకు పలుమార్లు సూచించింది. ఆయన మాత్రం దానిని నెరవేర్చలేకపోయాడు. దీంతో గ్రామ పంచాయతీ సమక్షంలో ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చింది.
మరో ఆసక్తికరమైన విషయమేమంటే పహర్బూర్ గ్రామాన్ని ప్రభుత్వం 'నిర్మల్ గ్రామం'గా ప్రకటించింది.
తాను తన భర్తకు టాయిలెట్ కట్టించమని పలుమార్లు చెప్పానని, అయినప్పటికీ దానిని నిర్మించలేదని, దీంతో తాను విసుగు చెంది అతనిని విడవవలసి వచ్చిందని సునితా దేవి చెప్పారు.
తాను ప్రతి నిత్యం టాయిలెట్ కోసం ఆరు బయటకు వెళ్లవలసి వస్తుందని, ఇది తనకు ఇబ్బందికరంగా అనిపిస్తోందని, చీకట్లో తాను వెళ్లవలసి వస్తోందని ఆమె వాపోయారు. తాను ఆరు బయటకు వెళ్లినప్పుడు ఆ స్థలం యజమాని కూడా తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని వాపోయారు.
గత నాలుగేళ్లుగా తాను తన భర్తను టాయిలెట్ కట్టించాలని కోరుతున్నానని చెప్పారు. అయితే, దానిని అతను కట్టించడం లేదన్నారు. పైగా, దీనిని కట్టించేందుకు తన తల్లిదండ్రుల నుండి డబ్బులు తేవాలని చెప్పాడని విమర్శించారు. కాగా, బీహార్లో 105 మిలియన్ల ప్రజలు ఉంటే, 21.9 మిలియన్ల ప్రజలకు టాయిలెట్ సౌకర్యం లేదు.
టాయిలెట్ కట్టించలేదని విడాకులు తీసుకున్న సునితా దేవి వయస్సు 25. ఆమె భర్త పేరు ధీరజ్ చౌదరి. ధీరజ్ చౌదరి కూరగాయల వ్యాపారం నిర్వహిస్తుంటాడు. వారికి పిల్లలు లేరు. వీరు రెండు గదుల ఇంటిలో నివసించేవారు. అందులోనే ధీరజ్ పేరెంట్స్ కూడా ఉంటున్నారు.
తన భార్య వ్యాఖ్యల పైన భర్త ధీరజ్ స్పందించాడు. టాయిలెట్ కట్టించమని తన భార్య తనను పలుమార్లు అడిగింది నిజమేనని చెప్పాడు. కానీ తన వద్ద డబ్బుల్లేవని చెప్పాడు. తన తండ్రి కూడా ఇటీవలే మృతి చెందాడని చెప్పాడు. తన కుటుంబంలో సంపాదించేది తాను ఒక్కడినేనని చెప్పాడు.