సింగపూర్ నుంచి ధర్డ్ వేవ్-ఫ్లైట్స్ రద్దు చేయాలన్న కేజ్రివాల్- ఆనవాళ్లే లేవని కౌంటర్
భారత్లో కరోనా సెకండ్ వేవ్ మరికొద్ది రోజుల్లో తగ్గుముఖం పడుతుందన్న సూచనల నేపథ్యంలో ధర్డ్ వేవ్పై చర్చ మొదలైంది. కరోనా మూడో దశ వైరస్ చిన్నారుల్ని లక్ష్యంగా చేసుకుని త్వరలో విరుచుకుపడే ప్రమాదముందని భారతీయ మీడియా కోడై కూస్తోంది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ సైతం కోవిడ్ మూడో దశకు కారణమయ్యే వైరస్ రకం ఉందని భావిస్తున్న సింగపూర్ నుంచి వచ్చే ఫ్లైట్ల రాకపోకల్ని రద్దు చేయాలని నిన్న కేంద్రాన్ని కోరారు. దీనిపై సింగపూర్ తీవ్రంగా స్పందించింది.
సింగపూర్లో కోవిడ్ ధర్డ్ వేవ్ వైరస్
ప్రస్తుతం భారత్లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతోంది. ఇది ప్రస్తుతం పీక్ స్టేజ్లో కొనసాగుతోంది. త్వరలో ఇది తగ్గుముఖం పడుతుందని, ఆ తర్వాత ధర్డ్ వేవ్ ప్రభావం మొదలవుతుందన్న కథనాలు వెలువడుతున్నాయి. భారతీయ మీడియాలో సాగుతున్న ఈ ప్రచారంలో భాగంగా ధర్డ్ వేవ్ వైరస్ ఇప్పటికే సింగపూర్లో కనిపించిందని, త్వరలో ఇది భారత్కు విస్తరించనుందనే అంచనాలు సాగుతున్నాయి. దీంతో సింగపూర్ నుంచి ఈ వేవ్ రాకుండా అడ్డుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.
సింగపూర్ రాకపోకలు బంద్ చేయాలన్న కేజ్రివాల్
సింగపూర్ నుంచి కోవిడ్ ధర్డ్ వేవ్ వైరస్ భారత్లోకి వస్తుందన్న భయాల నేపథ్యంలో నిన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ రియాక్ట్ అయ్యారు. ధర్డ్ వేవ్కు కారణమవుతుందని భావిస్తున్న సింగపూర్ రకం వైరస్ను అడ్డుకునేందుకు కేంద్రం వెంటనేచర్యలు చేపట్టాలని కేజ్రివాల్ నిన్న సీరియస్గా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అంతే కాదు సింగపూర్ నుంచి విమానాల రాకపోకల్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. దీంతో సింగపూర్ వైరస్పై కలకలం మరింత పెరిగింది.
ఆనవాళ్లే లేవంటూ సింగపూర్ ఫైర్
తమ దేశంలో కొత్తగా బయటపడిన సింగపూర్ వేరియంట్ కారణంగా భారత్లో ధర్డ్వేవ్ ప్రమాదం పొంచి ఉందన్న వాదనల్ని ఆ దేశం తోసిపుచ్చింది. కేజ్రివాల్ వ్యాఖ్యల నేపథ్యంలో సింగపూర్ ఆరోగ్యమంత్రిత్వశాఖ స్పందించింది. తమ దేశంలో అసలు సింగపూర్ రకం వైరస్సే లేదని, ఇక దీంతో ధర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఎక్కడుందని ప్రశ్నించింది. ఈ మేరకు భారతీయ మీడియాలో వచ్చిన కథనాల్ని సింగపూర్ ఆరోగ్యశాఖ ఖండించింది.
ఆ వైరస్ భారత్దేనన్న సింగపూర్
తాజాగా తమ దేశంలో బయటపడిన కేసుల్లో కనిపించిన బీ 1.617.2 రకం వైరస్ తమది కాదని, అది భారత్ నుంచి తమ దేశానికి వచ్చిందేనని సింగపూర్ ప్రకటించింది. ప్రస్తుతం సింగపూర్లో చిన్నారులతో పాటు పెద్దల్లోనూ కనిపిస్తున్న ఈ వైరస్ రకం భారత్కు చెందిందే అని సింగపూర్ ఇండియా ఓ ట్వీట్లో పేర్కొంది. ఇందులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ వ్యాఖ్యల్ని సైతం కోట్ చేసింది. తద్వారా భారత్లో వైరస్ కారణంగా తాము ఇబ్బందులు ఎదుర్కొంటుంటే సింగపూర్ వైరస్ అంటూ కొత్త పుకార్లు వ్యాపించడం సరికాదని ఆ దేశం తెలిపింది.