సైన్స్ కాంగ్రెస్ సర్కస్, నేను రాను: రామకృష్ణన్
చండీఘర్: భారత సైన్స్ కాంగ్రెసు సదస్సులకు ఇక ముందు హాజరు కాకూడదని భారత సంతతికి చెందిన నోబెల్ బహుమతి విజేత వెంకట్రామన్ రామకృష్ణన్ నిర్ణయించుకున్నారు. భారత సైన్స్ కాంగ్రెస్ సర్కస్ను తలపిస్తుందని ఆయన అన్నట్లు బుధవారం వార్తాకథనాలు వచ్చాయి.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం - గత సైన్స్ కాంగ్రెసు రెండు రోజుల సదస్సుకు ఆయన హాజరయ్యారు. అది జరిగిన తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత సైన్స్ కాంగ్రెసు సదస్సులకు హాజరు కావడం సమయాన్ని వృధా చేసుకోవడమేనని ఆయన భావించారు.
"అదో సర్కస్, ఆ సంస్థలో సైన్స్ గురించి చర్చించేది ఏమీ ఉండదు. నా జీవిత కాలంలో భారత సైన్స్ కాంగ్రెసు సదస్సులకు హాజరు కాను" ఆయన అన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. సైన్స్కు రాజకీయాలను, మత విశ్వాసాలను ముడిపెట్టడాన్ని గత సైన్స్ కాంగ్రెసు సదస్సులో ఆయన వ్యతిరేకించారు.
ప్రస్తుతం భారత సైన్స్ కాంగ్రెసు వార్షిక సదస్సు మైసూరులో జరగనుంది. తమిళనాడులో జన్మించిన వెంకట్రామన్ రామకృష్ణన్ కేంబ్రిడ్జీ విశ్వవిద్యాలయంలో స్ట్రక్చురల్ బయోలజిస్టు. ఆయనకు 2009లో నోబెల్ బహుమతి వచ్చింది.