ఘోరం: బైకర్ను కారుతో ఢీకొట్టి.. మృతదేహాన్ని 17కి.మీల ఈడ్చుకెళ్లాడు
ఢిల్లీ: గ్రేటర్ నోయిడాలో నవంబర్ 3న చోటు చేసుకున్న అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఓ బైకును వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. దీంతో బైకు నడుపుతోన్న వ్యక్తి కారు బోనెట్లో ఇరుక్కుపోయి చనిపోయాడు.
ఆ తర్వాత కారు కిందపడిపోయాడు. కాగా, ఆ వ్యక్తి మృతదేహం కారు కింద ఇరుక్కుపోయినప్పటికీ.. కారు డ్రైవర్ 17 కిలోమీటర్లు అలాగే వెళ్లాడు. అనంతరం సికందరాబాద్ ప్రాంతం వద్ద మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయాడు.
కారులో ఇరుక్కున్న ఆ మృతదేహాన్ని మొత్తం 17 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు గ్రేటర్ నోయిడాకు సమీపంలోని సూరజ్పూర్ ప్రాంతానికి చెందిన సుఖ్పాల్ సింగ్(42) గా పోలీసులు గుర్తించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కారు యజమానిని గుర్తించారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. మొదట తన సోదరుడి ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురయ్యామని, అతని ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వచ్చిందని సుఖ్పాల్ సోదరుడు తెలిపారు. ఆ తర్వాత జరిగిన విషయం తెలిసి తీవ్ర వేదనకు గురైనట్లు చెప్పారు.