Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐదేళ్లు ఉంటుందా మూన్నాళ్ల ముచ్చటేనా: సంకీర్ణ ప్రభుత్వం ముందు సవాళ్లు ఎన్నో..!

ముంబై: నెల రోజుల హైడ్రామా తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు ఓ కొలిక్కి వచ్చాయి. ఇక శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలు మహావికాస్ అగాడీ పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రంగం సిధ్ధం చేసుకున్నాయి. అయితే సంకీర్ణ ప్రభుత్వం మూనాళ్ల ముచ్చటలా కాకుండా పూర్తిస్థాయిలో ఐదేళ్ల పాటు ఉంటుందా..అనేది చాలామందిలో నెలకొన్న సందేహం. ఇంతకీ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈ మూడుపార్టీలకు ముందున్న సవాళ్లేంటి.. వాటిని ఏకాభిప్రాయంతో అధిగమించగలవా..?

 ఐదేళ్లు ప్రభుత్వంలో ఉంటుందా..?

ఐదేళ్లు ప్రభుత్వంలో ఉంటుందా..?

మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలు కూటమిగా ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. ఈ ప్రభుత్వంకు కెప్టెన్‌గా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఉండనున్నారు. ఉద్ధవ్ థాక్రేకు అనుభవం లేకపోవడం ఒక్కింత మైనస్ అయినప్పటికీ శరద్ పవార్ సహకారం అనుభవంతో నెట్టుకురాగలడనే నమ్మకం ఆయనకు ఉంది. ఇక ఎటొచ్చి ఒక్కో పార్టీకి ఒక్కో సిద్ధాంతం ఉండటం వల్ల ఈ ప్రభుత్వం ఐదేళ్లు నెట్టుకురాగలదా అనే ప్రశ్న తలెత్తుతోంది. తెరముందు ఉద్దవ్ థాక్రే ఉండగా తెరవెనకాల శరద్ పవార్ తన పవర్ చూపేందుకు సిద్దమవుతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

 వేర్వేరు అభిప్రాయాలు సిద్ధాంతాలు

వేర్వేరు అభిప్రాయాలు సిద్ధాంతాలు

ఎన్సీపీ ఒరిజినల్‌గా కాంగ్రెస్ నుంచి పుట్టినదే కాబట్టి వాటి సిద్ధాంతాలు దాదాపు ఒకటిగానే ఉన్నాయి. ఇక ఎటొచ్చి శివసేన పార్టీ ప్రధాన అజెండా హిందూత్వమే. ఇక్కడే మూడు పార్టీలకు పొసుగుతుందా లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 1980 నుంచే రేడికల్ హిందూత్వ పార్టీగా శివసేనకు ముద్రపడింది. ఇప్పుడు కాంగ్రెస్ శివసేనతో జతకట్టడంతో ఆ పార్టీకి ఉన్న మైనార్టీ ఓటు బ్యాంకుపై ప్రభావం పడుతుందా అనేదానిపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక శివసేన ఎన్సీపీల మధ్య కూడా మరో రకమైన పోటీ నెలకొంది. ఒక పార్టీ మనుగడ సాగాలంటే మరొక పార్టీ ఉండకూడదనే పోటీ ఈ ఎన్సీపీ శివసేనల మధ్య ఉంది. ఇలా వేర్వేరు అభిప్రాయాలు సిద్ధాంతాలు కలిగి ఉన్న మూడు పార్టీలు ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. మూడు పార్టీల్లో ఏ ఒక్క పార్టీ సంతృప్తిగా లేకపోయినా కూటమి కూలడం ఖాయంగా కనిపిస్తోంది.

ఐదేళ్లు ప్రభుత్వంలో ఉంటే బీజేపీకి బ్యాడ్ టైమ్

ఐదేళ్లు ప్రభుత్వంలో ఉంటే బీజేపీకి బ్యాడ్ టైమ్

ఇక మూడు పార్టీలు కలిసి ఐదేళ్లు ప్రభుత్వంలో కనక ఉంటే బీజేపీకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్లే అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకోసమే బీజేపీ హవా ఉండాలంటే ఏ ఒక్క చిన్న అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ముఖ్యంగా మూడు పార్టీల మధ్య ఉన్న సిద్ధాంతపరమైన విబేధాలనే అస్త్రాలుగా మలుచుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో ముఖ్యంగా హిందూత్వ నేత వీర్ సావర్కర్‌కు భారత రత్న ఇచ్చే అంశం లేవనెత్తడంతో పాటు, 17వ శతాబ్దంలో అదిల్‌షాహి జనరల్ అఫ్జల్ ఖాన్‌ను చత్రపతి శివాజీ అంతమొందించారు. అక్కడే ఓ సమాధి నిర్మాణం జరిగింది. పూజలు కూడా జరుగుతున్నాయి. దీనిపై హిందూ సంఘాలు ఒకప్పుడు నిరసనలు వ్యక్తం చేశాయి. ఎప్పుడో మరిచిన ఈ అంశాన్ని తిరిగి బీజేపీ తెరపైకి తీసుకొచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

మూడు పార్టీల మధ్య సఖ్యత కుదురుతుందా..?

మూడు పార్టీల మధ్య సఖ్యత కుదురుతుందా..?

ఇక బీమా కోరెగావ్ అల్లర్లు, ముస్లింలకు రిజర్వేషన్లు అంశంలాంటి అంశాలపై మూడుపార్టీల మధ్య సఖ్యత కుదురుతుందా అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఇక శివసేన పార్టీది హిందూత్వ అజెండా అని అందరికీ తెలుసు. అయితే ప్రభుత్వంలో కొనసాగాలంటే ఈ అంశానికి కాస్త బ్రేక్ ఇవ్వక తప్పదు. 1966లో హిందూ సంఘంగా ప్రారంభమైన శివసేన నేడు ఒక రాజకీయ శక్తిగా ఎదిగింది. ఇక ఇదే అజెండాగా శివసేన ముందుకు వెళితే మాత్రం కాంగ్రెస్‌కు కష్టమవుతుంది. ఇక పాలనా పరంగా మంచి బ్యూరోక్రాట్లను శివసేన సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఇక 2014లో ఫడ్నవీస్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ శివసేన తన మార్క్ పాలన చూపేందుకు అవకాశం రాలేదు.

 శివసేన హామీలు నెరవేర్చాలంటే నిధులు సరిపోవు

శివసేన హామీలు నెరవేర్చాలంటే నిధులు సరిపోవు

ఎన్నికల సందర్భంగా శివసేన పలు హామీలు ఇచ్చింది. ఇందులో ప్రధానంగా రైతు రుణాలు మాఫీ, కరెంటు బిల్లుల్లో 30శాతం తగ్గింపు, రూ.10కే భోజనం, ఒక్క రూపాయికే హెల్త్ చెకప్‌లాంటి హామీలు ఇచ్చింది. ఈ హామీలు నెరవేరిస్తే రాష్ట్ర ఖజానాలో నిధులు సరిపోవు. ఒకవేళ సరిపోయినా.. అభివృద్ధి పనులకు నిధులు మిగలవు. ఇక ఇన్ని ఇబ్బందుల మధ్య శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే హిందూత్వ అజెండా పక్కనబెట్టి తన మార్కు పాలన చూపాలని విశ్లేషకులు అభిప్రాయపడుతు్న్నారు. ఇక మంత్రి పదవుల పంపకాల్లో కూడా మూడు పార్టీలు అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాల్సి ఉంది. ఎవరికైనా అసంతృప్తి కలిగితే ఇక కథ మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉంది. పరిస్థితులు కర్నాటకలో ఎలా అయితే తారుమారు అయి కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చాయో మహారాష్ట్రలో కూడా అదే జరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక సంకీర్ణ ప్రభుత్వంలో చిన్న అలజడి కోసం బీజేపీ ఎదురు చూస్తోంది. ఏ చిన్న బేధాభిప్రాయాలు నెలకొన్నా అవకాశాన్ని మాత్రం వదలకూడదనే పట్టుదలతో కమలనాథులు ఉన్నట్లు సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+