దావూద్ ను పట్టుకోవడం అంత సులభం కాదు
ముంబై: అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడం అంత సులభం కాదని ఢిల్లీ నగర మాజీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ అన్నారు. ఎందుకంటే దావూద్ ఇబ్రహీం మన శత్రుదేశం పాకిస్థాన్ లో తలదాచుకున్నాడని గుర్తు చేశారు.
పాకిస్థాన్ గుడాచార సంస్థ అయిన ఐఎస్ఐ కనుసన్నల్లో దావూద్ ఇబ్రహీం ఉన్నాడని చెప్పారు. ఐఎస్ఐ సూచనల మేరకు దావూద్ ఇబ్రహీం ఎక్కడ సంచరించాలో నిర్ణయించుకుంటాడని, అతను సొంతంగా తిరగడానికి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అంతే కాకుండ దావూద్ ఇబ్రహీంను పట్టుకుని తీసుకురావాలనే రాజకీయ చిత్తశుద్ది మనదేశానికి లేకపోవడం అందుకు ఓ కారణం అని అన్నారు. శత్రుదేశం అండతో వారి రక్షణలో ఉన్న దావూద్ ఇబ్రహీం చాల క్షేమంగానే ఉంటాడని నీరజ్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇంత కాలం నుంచి తప్పించుకుని తిరుగుతున్న దావూద్ ఇబ్రహీంను పట్టించడానికి మరో మాఫియా డాన్ ఛోటా రాజన్ చేసే సహాయం ఏమి లేదని చెప్పారు. నీరజ్ కుమార్ డయల్ ఫర్ డాన్ పేరిట రాసిన పుస్తకాన్ని ముంబైలో విడుదల చేశారు.
ఈ సందర్బంగా మాజీ ఐపీఎస్ అధికారి నీరజ్ కుమార్ ఒక మాట మాత్రం కుండలు బద్దలుకొట్టినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రయత్నిస్తే దావూద్ ఇబ్రహీంను పట్టుకుని భారత్ తీసుకు వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు.
అయితే దావూద్ ఇబ్రహీంను ఎలాగైనా పట్టుకుని భారత్ తీసుకు వస్తామని కేంద్ర ప్రభుత్వం అంటున్నది. ఇంటిలిజెన్స్ వర్గాలు సైతం దావూద్ ఇబ్రహీం అతని కుటుంబ సభ్యులతో కలిసి పాకిస్థాన్ లోని కరాచిలో తలదాచుకున్నాడని పూర్తి వివరాలు సేకరించింది.