జయ మృతిపై అనుమానాలా?: పన్నీరుకు సీఎం పదవిపై వెంకయ్య
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై నిరాధారమైన సందేహాలు లేవనెత్తడం సరికాదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.
చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై నిరాధారమైన సందేహాలు లేవనెత్తడం సరికాదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం చెన్నైలోని కమలాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జయ మరణంపై వస్తున్న అనుమానాలన్నీ అర్థరహితమని తెలిపారు.
ఆమె మృతదేహాన్ని వెలికి తీసి మళ్లీ పరీక్షలు జరపాలన్నదానికి కూడా తాను వ్యక్తిగతంగా సమర్థించలేనని, ఆమె అంటే తనకు ఎంతో గౌరవమని చెప్పారు. 'ఒక వేళ న్యాయమూర్తికి అనుమానం ఉంటే అది ఆయన వ్యక్తిగతం. ఆయన నోటీసు ఇస్తే కేంద్రం సమాధానం ఇస్తుంది. న్యాయస్థానం ఏమి చెబుతుందో చూద్దాం'అని అన్నారు.
జయకు అందిన వైద్య సేవలపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. 'వైద్యులను నమ్మకపోవడానికి కారణాలేమీ లేవు. నేనూ వారితో మాట్లాడా. ఆమె కోలుకున్నారు. కానీ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. అనుమానించేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. వారికి సంబంధిత అధికార వర్గాలు తగిన వేదికపై సమాధానం ఇస్తాయి' అని అన్నారు.
వ్యక్తిగత సమాచారమే అయిప్పటికీ ఆసుపత్రి వర్గాలు ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్లు విడుదల చేశాయని, అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారని వివరించారు. ఎవరికైనా అనుమానాలు ఉంటే సంబంధిత అధికారులకు తగిన ఆధారాలను సమర్పించవచ్చని చెప్పారు.
తమిళనాడు ప్రభుత్వం, అన్నాడీఎంకే వ్యవహారాల్లో కేంద్రం ఏమాత్రం జోక్యం చేసుకోవడం లేదని వెంకయ్య నాయుడు చెప్పారు. పన్నీర్సెల్వం ముఖ్యమంత్రి కావడంలోనూ కేంద్రం హస్తం లేదని స్పష్టం చేశారు.
ఇది ఇలా ఉండగా, నోట్ల రద్దుపై మాట్లాడుతూ.. నోట్ల రద్దు మంచి ఫలితాలే ఇస్తోందని వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రధాని పలు సంక్షేమ పథకాలు ప్రకటించడం, బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గడమే ఇందుకు ఉదాహరణలని తెలిపారు. స్వాతంత్య్రం అనంతరం మోడీలాగా అవినీతిపై ఎవరూ పోరాడడం లేదని తెలిపారు.
నోట్ల రద్దుపై కాంగ్రెస్ చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. నోట్లు రద్దు చేయాలని 1971లో జస్టిస్ కె.ఎన్.వాంఛూ కమిటీ సిఫార్సు చేస్తే, ఎన్నికల దృష్ట్యా దాన్ని అమలు చేయలేమని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, ఆర్థిక మంత్రి వైబి చవాన్ అన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ వారు కమ్యూనిస్టులు, కులవాదులు, మతవాదులతో పాటు అవినీతితో కూడా పొత్తు పెట్టుకుంటారని ఎద్దేవా చేశారు.