అవమానం మరచిపోలేను, హైదరాబాద్లో అరెస్ట్పై భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్, బలవంతంగా ఢిల్లీకి తరలింపు
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ను హైదరాబాద్ పోలీసులు ఢిల్లీ పంపించారు. సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన ఆజాద్ను నిన్న లంగర్హౌజ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం 6.55 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ పంపించినట్టు పోలీసులు పేర్కొన్నారు.
సీఏఏకు వ్యతిరేకంగా టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ విద్యార్థులు ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనేందుకు చంద్రశేఖర్ ఆజాద్ ఇక్కడికి వచ్చారు. అయితే నిరసన ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. అక్కడినుంచి బొల్లారం పీఎస్కు తరలించారు.
పౌరసత్వ సవరణ చట్టంతోపాటు జాతీయ పౌర రిజిష్టర్, జాతీయ పౌర పట్టికకు వ్యతిరేకంగా చంద్రశేఖర్ ఆజాద్ ప్రసంగించాల్సి ఉంది. అయితే ఆయనను ముందుగానే పోలీసులు అరెస్ట్ చేశారు. తన అరెస్ట్పై చంద్రశేఖర్ ఆజాద్ సోమవారం ఉదయం ట్వీట్ చేశారు. హైదరాబాద్లో తనకు జరిగిన అవమానాన్ని దళితులు మరచిపోలేదని చెప్పారు. తనను పోలీసులు బలవంతంగా ఎయిర్పోర్టు తీసుకెళ్లారని పేర్కొన్నారు.
సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన చేపట్టిన ఆజాద్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తీహార్ జైలుకు తరలించగా.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో.. సీఏఏకు వ్యతిరేకంగా ఆజాద్ నిరసన ర్యాలీలు చేపడుతూనే ఉన్నారు.