ఫోర్త్ వేవ్ వచ్చినా భయంలేదు కానీ.. డబ్ల్యూహెచ్ఓ మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాధన్
భారతదేశంలో కరోనా మహమ్మారి ఫోర్త్ వేవ్ పై దేశవ్యాప్తంగా ఆందోళనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కరోనా మహమ్మారి విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అలానే అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా కూడా ఉండకూడదని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్.
కరోనా ఫోర్త్ వేవ్ విషయంలో భయం వద్దు : సౌమ్య స్వామినాథన్
విశాఖలో ఏఏపీఐ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనడానికి వచ్చిన ఆమె భారత దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్ సమర్థవంతంగా జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. కరోనా మహమ్మారి పూర్తిగా నివారణ కాలేదు కాబట్టి మాస్కులు ధరించడం, పరిశుభ్రత పాటించటం తప్పనిసరి అని ఆమె వెల్లడించారు. ఇప్పటిదాకా రెండు వ్యాక్సిన్ డోసులు తీసుకోనివారు తీసుకోవాలన్నారు. 60 ఏళ్ల పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు బూస్టర్ డోస్ వేయించుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్ సమర్ధవంతంగా ఇండియాలో జరిగిందన్నారు.
కరోనా మహమ్మారి తో సహా వివిధ వ్యాధుల నిర్ధారణకు మరిన్ని లేబరేటరీలు అవసరం
ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి ఎక్కువ ప్రాధాన్యత నివ్వడం అభినందించాల్సిన విషయమని సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. దేశంలో కరోనా మహమ్మారి తో సహా వివిధ వ్యాధుల నిర్ధారణకు మరిన్ని లేబరేటరీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సౌమ్య స్వామినాథన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతదేశంలో దీర్ఘకాలిక వ్యాధులు సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్న ఆమె మధుమేహం, రక్తపోటు, కిడ్నీ, హృద్రోగ సమస్యలు వంటి నాన్ కమ్యూనికబుల్ జబ్బుల వల్ల 70 ఏళ్ల కంటే ముందుగానే మనుషులు చనిపోతున్నారన్నారు.
వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచాలి
దీనికి జన్యుపరమైన కారణాలతోపాటుగా, జీవనశైలి మార్పులు, తీపి పదార్థాలు ఎక్కువగా తినడం, పర్యావరణ కాలుష్యం కారణమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఇలాంటి వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని, అవి రాకుండానే జాగ్రత్త పడాల్సి అవసరం ఉందని సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి ఫోర్త్ వేవ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని, ఫోర్త్ వేవ్ వచ్చిన దేశ ప్రజలకు ప్రమాదమేమీ లేదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.