సేమ్ సీన్.. సరిహద్దులో భారీగా దళాలు... స్పెషల్ ఆపరేషన్ తప్పదా..?
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన టాప్-2 కంట్రీస్... గత కొద్దిరోజులుగా సరిహద్దుల్లో ఎడతెగని ఉద్రిక్తతలు... యుద్దమే పరిష్కారమా.. డ్రాగన్ దూకుడుకు అడ్డుకట్ట వేసేదెలా.. గత వారం రోజులుగా భారత్లో దీని పైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. గాల్వన్ వ్యాలీలో 20 మంది భారత సైనికుల వీర మరణం తర్వాత భారతీయుల భావోద్వేగాలు కట్టలు తెంచుకుంటున్నాయి. చాలామంది చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న నినాదాలిస్తున్నారు. కానీ నినాదాల కంటే క్షేత్ర స్థాయి వాస్తవాలకు ప్రాధాన్యమివ్వాలని విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు. మరోవైపు సరిహద్దు ఉద్రిక్తతలు ఇప్పటికీ తగ్గుముఖం పట్టకపోవడం గమనార్హం.
ఇప్పటికీ అదే పరిస్థితి...
'జూన్ 15న ఘర్షణలకు,ఇప్పటికీ పెద్దగా తేడా లేదు. హింస చోటు చేసుకోలేదు... కానీ గాల్వన్, పాంగోన్ సో సరిహద్దులకు ఇరువైపులా ఇరు దేశాల సైనికులు భారీ సంఖ్యలో మోహరించబడ్డారు.' అని 'సైనికాధికారి ఒకరు జాతీయ మీడియాతో వెల్లడించారు. ఆ ఘర్షణ జరిగిన నాటికి,ఇప్పటికీ హింసాత్మక ఘటనలేవీ చోటు చేసుకోకపోయినప్పటికీ.. ఇరుదేశాల మధ్య ఒక అపనమ్మకం ఏర్పడిందని.. ఇలాంటి పరిస్థితుల్లో భారత సైన్యం అక్కడి నుంచి వెనక్కి తగ్గడం సాధ్యం కాదని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి.
అన్ని అవకాశాలను పరిశీలిస్తున్న భారత్...
ప్రస్తుతం గాల్వన్ వ్యాలీలో వాస్తవాధీన రేఖకు అటు వైపు,ఇటువైపు ఇరు దేశాల సైనికులు భారీగా మోహరించబడ్డారు. గాల్వన్ పాట్రోల్ పాయింట్ 14,పాంగోంగ్ సో వద్ద ఇరు దేశాలు భారీ సైన్యంతో గస్తీ కాస్తున్నాయి. ఒకరకంగా ఇది బలప్రదర్శనే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్ఏసీ వెంబడి చైనా ఇప్పటికీ నిర్మాణాలు చేపడుతుందన్న కథనాలు వస్తున్నాయి. చైనా దూకుడు ఇలాగే కొనసాగితే.. ఎలా ప్రతిస్పందించాలన్న దానిపై భారత్ సమాలోచనలు జరుపుతోంది. ఇందుకోసం ఆర్మీ పరంగా అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది.
ప్రోటోకాల్ను సైతం పక్కనపెట్టి..
ముఖ్యంగా భారత పరిధిలోని ఫింగర్ 4 ప్రాంతంలో పాంగోంగ్ సరస్సు వద్ద మోహరించిన చైనా సైన్యాన్ని వెనక్కి తరిమేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాలనే యోచనలో భారత్ ఉన్నట్టు తెలుస్తోంది. తూర్పు,పశ్చిమ సెక్టార్లో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు 3,488 కి.మీ పొడవైన ఎల్ఏసీ వెంబడి ప్రత్యేక దళాలను మోహరించినట్టు భారత్ స్పష్టం చేసింది. భారత సైన్యానికి సరిహద్దులో పూర్తి స్వేచ్చనిచ్చామని ఇప్పటికే కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రాణాపాయ స్థితిలో ప్రతిదాడికి వెనకాడవద్దని సూచించింది. నిజానికి ఇరు దేశాల మధ్య ఒప్పందం ప్రకారం ఆయుధాలను ఉపయోగించడంపై నిషేధం ఉంది. అయితే ఆత్మరక్షణ విషయంలో ఇది వర్తించదని కేంద్రం ఆర్మవర్గాలకు వెల్లడించింది.