Ayodhya verdict: ఇప్పుడు రామమందిరం కాదు, ఎన్నికల్లో ఇక అసలైన అంశాలే: ఉమాభారతి
న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఉమా భారతి స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పుతో రామ మందిరం నిర్మాణం జరుగుతుందని, ఇక ఎన్నికలన్నీ అసలైన సమస్యలపైనే జరుగుతాయని అన్నారు.
ayodhya verdict:1934లో అల్లర్లు, 1949లో ఆటంకాలు.. అయోధ్య తీర్పులో ప్రస్తావించిన రాజ్యాంగ ధర్మాసనం
ఇకపై అసలైన అంశాలపైనే..
ఇకపై జరిగే ఎన్నికల్లో రామ మందిరం అంశం ఉండబోదని, రోటి, దుస్తులు, విద్య లాంటి అసలైన అంశాలపైనే ఎన్నికలు జరుగుతాయని ఉమాభారతి స్పష్టం చేశారు. అయోధ్య పోరాటంలో బీజేపీ అగ్ర నేత ఎల్కే అద్వానీ పాత్ర కీలకమైనదని ఆమె ప్రశంసించారు. వివాదం కమ్యూనలిజం వర్సెస్ సెక్యూలరిజమ్గా సాగిందని, సుడో సెక్యూలరిజమ్ డ్రామాను అద్వానీ బయటకి లాగారని ఆమె అన్నారు.
అద్వానీజీనే ముందుండి..
బీజేపీతోపాటు అయోధ్య పోరాటాన్ని ముందుకు నడిపినవారిలో అద్వానీదే కీలక పాత్ర అని ఉమాభారతి వ్యాఖ్యానించారు. ‘అద్వానీ జీ మా నాయకుడు. నేను ఆయన కూతుర్ను, లెఫ్ట్నెంట్ని' అని ఆమె చెప్పుకొచ్చారు. ఒక సమయంలో పార్లమెంటులో తమ పార్టీకి చెందిన ఎంపీలు ఇద్దరే ఉండేవారని, కానీ ఇప్పుడు అధికారంలో కొనసాగుతున్నామని చెప్పారు. అద్వానీనే బీజేపీకి పునాదులు వేశారని ఉమాభారతి వ్యాఖ్యానించారు. ఇందుకు ఆయనకు నేను ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు. పార్లమెంటులో జాతీయవాదం, సుడో సెక్యూలరిజంపై తొలిసారి ఆయన చర్చించారని, సుడో సెక్యూలరిజాన్ని బట్టబయలు చేశారని అన్నారు.
అద్భుతమైన తీర్పు..
అద్వానీని కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని, ఆ తీర్పును ప్రశంసించకుండా ఉండలేకపోతున్నానని ఉమాభారతి చెప్పుకొచ్చారు. అద్భుతమైన తీర్పని, ఇరువర్గాలకు న్యాయం చేసేలా తీర్పు ఉందని అన్నారు. దేశం యావత్తు ఈ తీర్పును స్వాగతిస్తోందని ఉమాభారతి తెలిపారు.
అయోధ్య తీర్పు ఇలా..
కాగా, అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని ఆదేశించింది. ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం ఇవ్వాలని తీర్పు చెప్పింది. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ వేర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మోహి అఖారా వ్యాజ్యాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందిందని పేర్కొన్నారు. వివాదాస్పద స్థలంపై ఎవరూ యాజమాన్య హక్కులు కోరలేదని తెలిపారు. నిర్ణయానికి ముందు రెండు మతాల విశ్వాసాలను పరిగణలోకి తీసుకున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ చెప్పారు. అక్కడ మందిరం ఉన్నట్లు పురవాస్తు శాఖ నివేదికలు చెబుతున్నాయని పేర్కొన్నారు.