ఇక 'ఒకే దేశం-ఒకే చట్ట సభల వేదిక-అసెంబ్లీలు, పార్లమెంట్ బంధం పెరిగేందుకు-మోడీ పిలుపు
దేశవ్యాప్తంగా చట్టసభలు, పార్లమెంటు విడివిడిగా పనిచేయడం వల్ల ప్రజాస్వామ్య ఉద్దేశం నెరవేరడం లేదు. ఎవరికి వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజాస్వామ్యం బలోపేతం అయ్యేందుకు వీలు కలగడం లేదు. దీంతో స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా ఇంకా దేశంలో సమస్యలు అాలాగే ఉన్నాయి. కానీ రాబోయే 25 ఏళ్లలో దేశ స్వాతంత్రానికి వందేళ్లు నిండబోతున్నాయి. ఆ లోపు దేశంలో అన్ని చట్టసభలు కలిసి పనిచేసందుకు వీలుగా ఓ పటిష్ట వేదిక ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ ఇవాళ పిలుపునిచ్చారు.
75 ఏళ్ల స్వాతంత్ర్యం
భారత్ కు 1947లో స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కేంద్రం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతో వేడుకలు కూడా నిర్వహిస్తోంది. అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా అనుకున్న లక్ష్యాల సాధన మాత్రం జరగడం లేదు. ముఖ్యంగా రాజ్యాంగం చిత్తశుద్ధితో అమలు జరుగుతోందా అంటే అనుమానమే. దీంతో 75 ఏళ్ల క్రితం ఏ లక్ష్యంతో అయితే రాజ్యాంగం రాసుకున్నామో ఆ లక్ష్యాలు ఇంకా కలగానే మిగిలిపోతున్నాయి. వీటిని సాధించలేకపోతే మరో పాతికేళ్ల తర్వాత వందేళ్ల మహోత్సవం చేసుకోవడం మినహా ప్రజాస్వామ్యానికి అర్ధం ఉండబోదని కేంద్రం భావిస్తోంది.
చట్టసభల మధ్య అంతరం
దేశంలో చట్టసభలైన రాష్ట్రాల అసెంబ్లీలు, పార్లమెంటు మధ్య అంతరం కొనసాగుతూనే ఉంది. పార్లమెంటు యథావిధిగా చట్టాలు చేసుకుంటూ పోతోంది. అదే తరహాలో అసెంబ్లీలు కూడా చట్టాలు చేసుకుంటూ వెళ్తున్నాయిు. వీటి మధ్య గ్యాప్ ఉండటంతో సాంకేతిక సమస్యలతో అవి అమలుకు నోచుకోవడం లేదు. తాజాగా కేంద్రం ఆమోదించిన వ్యవసాయ బిల్లుల్ని రాష్ట్రాల అసెంబ్లీలు తిరస్కరిస్తూ తీర్మానాలు చేసేస్తున్నాయి. దీంతో కేంద్రానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. కాబట్టి చట్ట సభల మధ్య ఉన్న ఈ గ్యాప్ ను తగ్గించేందుకు ఓ ఉమ్మడి వేదికకు కేంద్రం ప్రతిపాదిస్తోంది.
ఒకే దేశం-ఒకే చట్టసభల వేదిక
ప్రస్తుతం దేశంలోని చట్టసభలు అన్నీ కలిసి ఓ ఉమ్మడి వేదికపైకి వచ్చి పనిచేసేందుకు వీలుగా కేంద్రం ఒకే దేశం- ఒకే చట్టసభల వేదిక పేరుతో ఓ ప్లాట్ ఫామ్ ను ప్రతిపాదిస్తోంది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, పార్లమెంట్ వనరులను పంచుకోవడానికి "ఒక దేశం, ఒకే శాసన వేదిక" కోసం ప్రధాని మోడీ ఇవాళ పిలుపునిచ్చారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో 82వ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సమావేశం జరిగింది. 2047లో స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతున్నందున రాబోయే 25 ఏళ్లు భారతదేశానికి చాలా ముఖ్యమైనవని తన శతాబ్ది సంవత్సరంలో జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి మోదీ అన్నారు. ఈ సమయంలో, "మనం కర్తవ్యం, కర్తవ్యం, కర్తవ్యం అనే మంత్రాన్ని నెరవేర్చగలమని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
అసెంబ్లీలు, పార్లమెంట్ మధ్య సమన్వయ వేదిక
అన్ని శాసనసభలకు సాంకేతిక ప్రోత్సాహాన్ని అందించడానికి, శాసన వ్యవస్ధలను అనుసంధానించడానికి ఒక వెబ్ సైట్ ను రూపొందించాలని మోదీ పిలుపునిచ్చారు. తొలిసారిగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు సభలో సరైన రీతిలో ప్రవర్తించేలా శిక్షణ పొందాలని ఆయన అన్నారు. యువత, మహిళలు, ఆకాంక్షలు ఉన్న జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులకు సభలో మాట్లాడేందుకు మరింత సమయం ఇవ్వాలని ప్రధాని అన్నారు. "నాణ్యమైన చర్చ" కోసం ఒక రోజు ఉండాలని మరియు ఎన్నికైన ప్రతినిధులు తమ అనుభవాలను సభతో పంచుకోవాలని ఆయన అన్నారు. అసెంబ్లీలు, పార్లమెంటు మధ్య సమన్వయం, వనరుల పంపిణీకి ఉపయోగపడేలా ఓ ఉమ్మడి వేదిక ఉండాలని మోడీ కోరారు. త్వరలో దీనిపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమవుతోంది