కేంద్రం స్పందించకపోతే.. 'మా మూత్రం మేమే తాగుతాం': తమిళ రైతుల నిరసన
కేంద్రం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే.. తమ మూత్రం తామే తాగుతామంటూ రైతులు ఆందోళన చేశారు.
న్యూఢిల్లీ: కరువు నిధుల విడుదల కోసం దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమిళనాడు రైతుల వినూత్న నిరసన కొనసాగుతోంది. శనివారం నాడు యూరిన్ బాటిల్స్ తో రైతులు నిరసన తెలియజేయడం గమనార్హం. కేంద్రం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే.. తమ మూత్రం తామే తాగుతామని, తమ మలం తామే తింటామని రైతులు ఆందోళన చేశారు.
ఇంత తీవ్రంగా సమస్య పోరాడుతున్నా.. కేంద్రం నుంచి స్పందన లేదని, కనీసం ఇప్పటికైనా తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కరువు నిధులతో పాటు కర్ణాటక-తమిళనాడు మధ్య కావేరీ జలాల పంపిణీ కోసం కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మార్చి 14నుంచి ఢిల్లీలో వారి నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
కాగా, ఈ నిరసనలో భాగంగా గతంలో కపాలాలతోను, నగ్నంగాను, చనిపోయిన ఎలుకలు, పాములతోను రైతులు నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. అయితే రైతుల నిరసనపై స్పందించిన ప్రభుత్వం తమిళనాడుకు రూ.2వేల కోట్లు విడుదల చేసినా.. అవి తమకు సరిపోవని రైతులు వాదిస్తున్నారు. ఆ సహాయం సరిపోదని, మరిన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.