నేనే అసలైన వారసున్ని: తెర పైకి జయలలిత కొడుకు!, 'అది నచ్చకే చంపేశారు'
జయలలితకు ఉన్న ఏకైక కొడుకును తానే కావడంతో ఆమె ఆస్తులన్నింటికీ తానే అసలైన వారసుడినని కృష్ణమూర్తి ప్రకటించుకున్నాడు.
చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతి తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు ఎంతటి మలుపులు తిరిగాయో అందరికీ తెలిసిందే. రాజకీయంగా, ఆస్తుల పరంగా జయలలితకు తామంటే తాము వారసులమన్న పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ వివాదం ఇలా తెరపై ఉండగానే.. ఇప్పుడు ఇంకో కొత్త వ్యక్తి జయలలితకు తానే అసలైన వారసుడినని చెబుతున్నాడు.
అంతేకాదు, జయలలితకు ఉన్న ఏకైక కొడుకును తానే అని ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ కూడా రాశాడు. చెన్నైలోని ఈరోడ్ కు చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి ఈ కొత్త చర్చను తెరపైకి తెచ్చాడు. సొంత కొడుకుగా జయలలిత తనను ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్న తరుణంలోనే ఆమె మృతి చెందారని కృష్ణమూర్తి చెబుతున్నాడు.

అది నచ్చకే జయను చంపేశారు:
జయలలిత తనను సొంత కొడుకుగా ప్రకటించాలనుకోవడం శశికళకు నచ్చలేదని, దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని కృష్ణమూర్తి వాదిస్తున్నాడు. ఈ వివాదం కారణంగానే గతేడాది సెప్టెంబర్22న శశికళ జయలలితను మెట్ల మీది నుంచి కిందికి తోసి చంపేశారని అతను ఆరోపిస్తున్నాడు.

ఇప్పుడే ఎందుకు తెరపైకి?
జయలలితకు కొడుకును అని చెప్పుకుంటున్న కృష్ణమూర్తి ఇన్నాళ్లు ఎందుకు అజ్ఞాతంలోనే ఉన్నాడని ఈ విషయం తెలిసిన చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయితే తనకు ప్రాణహాని ఉన్నందునే ఇన్నాళ్లు మౌనంగా ఉండాల్సి వచ్చిందని ఆయన అన్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ:
వాస్తవాలను బయటపెట్టాలన్న ఉద్దేశ్యంతోనే చివరకు ధైర్యం చేసి విషయాన్ని బహిర్గతం చేశానని చెప్పుకొచ్చాడు. జయలలితకు ఉన్న ఏకైక కొడుకును తానే కావడంతో ఆమె ఆస్తులన్నింటికీ తానే అసలైన వారసుడినని ప్రకటించుకున్నాడు. తొలుత ఈ విషయంపై ట్రాఫిక్ రామస్వామికి కృష్ణమూర్తి లేఖ రాశాడు. ఆపై రామస్వామి సలహా మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

వారసులెవరు?
ఓవైపు జయలలిత మేనకోడలు దీప జయకుమార్, మేనల్లుడు దీపక్ తామే ఆమె ఆస్తులకు అసలైన వారసులమని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ నుంచి మన్నార్ గుడి మాఫియాను తరిమేయాలని వారు యోచిస్తున్న తరుణంలోనే ఇప్పుడు ఈ కొత్త వ్యక్తి తెరపైకి రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.












Click it and Unblock the Notifications